మావోయిస్టుల ఘాతుకం: ఐఈడీతో వాహనం పేల్చివేత: 16 మంది కమాండోలు దుర్మరణం
ముంబై: మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. రక్తపాతానికి తెగబడ్డారు. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ.. భారీ పేలుళ్లతో విరుచుకు పడ్డారు. కమాండోల వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో సీ-60 బెటాలియన్ కు చెందిన 16 మంది కమాండోలు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కమాండోలను వాహనాన్ని పేల్చి వేయడానికి మావోయిస్టులు ఐఈడీని ఉపయోగించినట్లు ప్రాథమిక సమాచారం. శక్తిమంతమైన ఐఈడీ మావోయిస్టుల చేతికి ఎలా చేరిందనే విషయం చర్చనీయాంశమౌతోంది.
మావోయిస్టులకు కంచుకోటగా భావించే ఛత్తీస్ గఢ్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది గడ్చిరోలి జిల్లా. ఈ జిల్లాలో ఛత్తీస్ గఢ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న కుర్ ఖేడా- జముర్ ఖేడా మార్గంలో ప్రయాణిస్తున్న కమాండోల వాహనాన్ని మావోయిస్టులు పేల్చి వేశారు. కూంబింగ్ నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనంలో డ్రైవర్ సహా మొత్తం 15 మందికి పైగా కమాండోలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఐఈడీతో వాహనాన్ని పేల్చివేయడం వల్ల 16 మంది దుర్మరణం పాలయ్యారు.
కుర్ ఖేడా ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున మావోయిస్టులు తమ ఉనికి చాటుకున్న విషయం తెలిసిందే. కుర్ ఖేడాలో వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టారు. ఒకేసారి 36 వాహనాలను తగులబెట్టారు మావోయిస్టులు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కమాండోలు సంఘటనా స్థలానికి బయలుదేరారు. వాహనాలను తగులబెట్టిన ప్రదేశానికి పోలీసులు గానీ, కమాండోలు గానీ రావచ్చని ఊహించిన మావోయిస్టులు దీనికి అనుగుణంగా ఐఈడీని పాతిపెట్టారు. కుర్ ఖేడా-జముర్ ఖేడా మార్గంలో కమాండోల వాహనం రాగానే.. దాన్ని పేల్చివేశారు.
సాధారణంగా మావోయిస్టులు ఎప్పుడు దాడి చేసినా.. మందుపాతరలను వినియోగిస్తారు. వాటితోనే విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల్లో మందుపాతరలతో సీఆర్పీఎఫ్, పోలీసుల వాహనాలను పేల్చి వేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ సారి మావోయిస్టులు శక్తిమంతమైన ఐఈడీలను వినియోగించడం పట్ల పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పెద్ద ఎత్తున ఐఈడీని మావోయిస్టులు ఎలా సమకూర్చుకున్నారనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఐఈడీ మావోయిస్టులకు ఎలా చేరిందనే విషయంపైనా వారు దర్యాప్తు చేస్తున్నారు.