అగ్రనేత అరెస్ట్ తో.. జార్ఖండ్లో రైలు పట్టాలను పేల్చేసిన మావోయిస్టులు; రైళ్ల రాకపోకలకు అంతరాయం
మావోయిస్ట్ లు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మావోయిస్ట్ పార్టీకి చాలా బలమైన దెబ్బలు తగులుతున్న క్రమంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా పలు చర్యలకు దిగుతున్నారు. నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) సభ్యులు శనివారం తెల్లవారుజామున జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో రైల్వే ట్రాక్లపై బాంబ్ పేలుడుకు పాల్పడ్డారని, రైల్వే ట్రాక్ పేల్చివేశారని, బర్కకానా-గర్వా మార్గంలో రైలు సేవలకు అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో రిచుఘూటా మరియు డెము స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్లపై పేలుడు సంభవించిందని ఒక అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలుస్తుంది.
లతేహార్లో రైల్వే ట్రాక్లను పేల్చివేసిన మావోయిస్ట్ లు
సిపిఐ-మావోయిస్ట్ స్క్వాడ్ సభ్యులు లతేహార్లో రైల్వే ట్రాక్లను పేల్చివేశారని దాంతో బర్కకానా-గర్హ్వా రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని పాలము రేంజ్ పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ లక్రా పిటిఐకి తెలిపారు. లక్రా రైల్వే అధికారులు ట్రాక్లకు మరమ్మతులు చేస్తున్నారు. దాదాపు ట్రాక్ మరమ్మత్తులు పూర్తయినట్టు తెలుస్తుంది. సెంట్రల్ ఈస్టర్న్ రైల్వేలోని ధన్బాద్ డివిజన్ పరిధిలోని పాలము, గర్వా మరియు లతేహర్ జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లు పేలుడు తర్వాత అప్రమత్తం అయినట్లు డీఐజీ తెలిపారు.
పేలుడు నేపధ్యంలో బస్సులను కూడా నిలిపివేసి సోదాలు
ఈ పేలుడులో డీజిల్ ఇంజిన్ ట్రాలీ దెబ్బతిన్నదని ఈసీఆర్ రైల్వే ప్రతినిధి పీకే మిశ్రా తెలిపారు. బర్కాకానా, బర్వాడీ ప్రత్యేక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని రైల్వే లైన్ల మరమ్మతులు చేపట్టి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పేలుడు ఘటన నేపథ్యంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో అనేక రైళ్లు దారి మళ్లించబడ్డాయి, డెహ్రీ-ఒన్సోన్-బర్వాడిహ్ మరియు బర్వాడిహ్-నెసుబోగోమో ప్రత్యేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. మేదినీనగర్ నుండి రాంచీకి ప్రయాణీకుల బస్సుల కదలికను కూడా నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అలెర్ట్ అయిన జార్ఖండ్ పోలీసులు వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కోటి రివార్డ్ ఉన్న మావోయిస్ట్ అగ్ర నేతను అరెస్ట్ చేసిన జార్ఖండ్ పోలీసులు
జార్ఖండ్ పోలీసులు కోటి రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు పార్టీ అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాను అరెస్టు చేసినందుకు నిరసనగా నిషేధిత మావోయిస్టు సంస్థ శనివారం దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది.జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో 100 కి పైగా దాడులు మరియు దహన సంఘటనల వెనుక బోస్ ప్రధాన సూత్రధారి. పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రశాంత్ బోస్ మావోయిస్టు నాయకుడు నెంబర్ టు గా ఉన్నారు.
మావోయిస్ట్ అగ్రనేత అరెస్ట్ నేపధ్యంలో మావోల పేలుడు ఘటన
గణపతి తర్వాత అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి బోస్ కావడం గమనార్హం. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా చీఫ్ గా ప్రశాంత్ బోస్ పనిచేశారు. ప్రశాంత్ బోస్ భార్య శీలా మరాండీ కూడా సీనియర్ మావోయిస్టు నాయకురాలు. ప్రశాంత్ బోస్ ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గా, పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. 75 ఏళ్ల వయసున్న ప్రశాంత్ బోస్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనను అరెస్టు చేయడంతో మావోయిస్టు పార్టీ దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. ఇక ఆయన అరెస్ట్ నేపధ్యంలో ఈ పేలుడుకు పాల్పడినట్టు భావిస్తున్నారు.