121 ఏళ్ల రికార్డ్ బ్రేక్: సొమ్మసిల్లే రేంజ్లో ఎండ తీవ్రత: అప్రమత్తంగా ఉండక తప్పదు: ఐఎండీ
న్యూఢిల్లీ: సాధారణంగా మార్చిని వేసవి సీజన్ ఆరంభ నెలగా భావిస్తుంటారు. మార్చి నెల రెండో వారంలోనో.. లేక మూడో వారంలోనో ఎండ తీవ్రత పెరుగుతుంటుంది. ఏప్రిల్-మే వరకూ కొనసాగుతుంటుంది. నైరుతి రుతు పవనాల ఆగమనం వరకూ ఇదే తరహా వాతావరణం నెలకొని ఉంటుంది. రుతు పవనాల రాక జాప్యం అయ్యే కొద్దీ ఎండ తీవ్రత మరి కొంతకాలం పాటు కొనసాగుతూనే ఉంటుంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అది ఏటేటా జరిగే ప్రక్రియ. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వైఎస్ జగన్తో రమణ దీక్షితులు భేటీ: తిరుపతి ఉప ఎన్నిక వేళ..: పింక్ డైమండ్ ఇష్యూ
121 సంవత్సరాల తరువాత మార్చిలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇది మూడోసారిగా అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చినెలలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రత రికార్డయిందని, ఈ 121 ఏళ్ల కాలంలో ఇది మూడోసారి మాత్రమేనని చెబుతున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ప్రతి సంవత్సరం మార్చి నెలలో రికార్డయ్యే సగటు ఉష్ణోగ్రత 25.06 డిగ్రీల వరకు ఉంటుంది. అదే సమయంలో గరిష్ఠంగా 31.24, కనిష్ఠంగా 18.87 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఈ సీజన్లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపించిందని, వేసవి కాలం ఆరంభంలోనే రికార్డు స్థాయిలో టెంపరేచర్ రికార్డయిందని అధికారులు చెబుతున్నారు.
గరిష్ఠంగా 32.65, కనిష్ఠంగా 19.95 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైందని, మార్చి నెల మొత్తంగా 26.30 డిగ్రీల టెంపరేచర్ రికార్డయిందని వెల్లడించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి నెలలో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడం అసాధారణ విషయమని అంచనా వేశారు. ఇదే తీవ్రత ఏప్రిల్-మే నెలల్లోనూ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలను వాతావరణ శాఖ అధికారులు వెలిబుచ్చుతున్నాారు. ఒడిశా, తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటిరాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.