పెళ్లయిన మహిళపై కన్నేసి.. పెళ్లి చేసుకోమంటూ కాల్పులు!
ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ వివాహితపై కాల్పులు జరిపిన దారుణ ఘటన గురుగ్రామ్లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
ఢిల్లీలోని నజాఫ్గఢ్కు చెందిన కల్పన(25) అనే మహిళ గురుగ్రామ్ ఎంజీ రోడ్డులోని ఓ క్లబ్లో పనిచేస్తోంది. డిసెంబర్ 20వ తేదీ తెల్లవారుజామున ఆమె విధుల్లో ఉండగా.. ఢిల్లీలోని సంగం విహార్కు చెందిన తుషార్ అలియాస్ జోంటీ తన స్నేహితుడు శుభమ్తో కలిసి అక్కడికి వచ్చాడు. కల్పనకు తుషార్లకు మధ్య గత 6 నెలలుగా పరిచయం ఉంది. ఆమెకు వివాహం జరిగిందని తెలిసి కూడా తనను పెళ్లి చేసుకోవాలని తుషార్ ఒత్తిడి తెచ్చేవాడు. ఆ రాత్రి కూడా క్లబ్లో ఆమెకు పెళ్లి ప్రపోజల్ చేయగా.. ఆమె ఖచ్చితంగా నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన తుషార్.. తన వద్ద ఉన్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యాడు.

భర్త ఫిర్యాదుతో వెలుగులోకి..
తీవ్రంగా గాయపడిన కల్పన వెంటనే తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గత నెలలో కూడా తుషార్ తమ ఇంటికి వచ్చి గొడవ పడ్డాడని బాధితురాలి భర్త పోలీసులకు వివరించాడు.
నిందితుల అరెస్ట్
గురుగ్రామ్ క్రైమ్ యూనిట్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని బరౌత్లో తలదాచుకున్న ప్రధాన నిందితుడు తుషార్ (25), అతడికి సహకరించిన శుభమ్ (24)లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తుషార్ బాధితురాలిని గత కొద్దికాలంగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు విచారణలో తేలింది. ఆమె నిరాకరించడంతోనే చంపాలనే ఉద్దేశంతో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఈ కేసులో తదుపరి విచారణను వేగవంతం చేశారు.












Click it and Unblock the Notifications