కేజ్రీవాల్కు ఊహించని దెబ్బ! బీజేపీలోకి రాఘవ్ చడ్ఢా..
జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పునాదులు కదిలిపోయేలా ఆ పార్టీకి చెందిన మెజారిటీ రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో కీలక వ్యూహకర్తగా పేరున్న రాఘవ్ చడ్ఢా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్ఢాతో పాటు మరో ఇద్దరు ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేవలం పార్టీ మారడమే కాకుండా, రాజ్యసభలో ఆప్ ఎంపీల బృందాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశారు.

2/3 వంతు మెజారిటీతో 'విలీనం' వ్యూహం
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవాలంటే కనీసం 2/3 వంతు సభ్యులు విడిపోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాఘవ్ చడ్ఢా నేతృత్వంలోని బృందం పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లింది. రాఘవ్ చడ్ఢా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్లతో పాటు హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలివాల్ కూడా తమ వెంటే ఉన్నారని చడ్ఢా ప్రకటించారు.
ఈ ఏడుగురు సభ్యులు సంతకం చేసిన పత్రాలను ఇప్పటికే రాజ్యసభ చైర్మన్కు సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉండదు.
"సరైన వ్యక్తి.. తప్పుడు పార్టీలో ఉన్నాను"
బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చడ్ఢా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నా రక్తాన్ని, చెమటను చిందించి 15 ఏళ్ల యవ్వనాన్ని ఈ పార్టీ కోసం ధారపోశాను. కానీ ఇప్పుడు ఆప్ తన సిద్ధాంతాలను, విలువలను వదిలేసింది. ప్రస్తుతం ఈ పార్టీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. గత కొన్నాళ్లుగా నేను ఒక సరైన వ్యక్తిని తప్పుడు పార్టీలో ఉన్నానని ఫీలయ్యాను. అందుకే ఇప్పుడు ఆప్కు దూరం జరిగి ప్రజలకు దగ్గరవుతున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాఘవ్ టర్న్ తీసుకోవడానికి కారణం ఇదేనా?
ఇన్ని రోజులు పార్లమెంటులో మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రాఘవ్ చడ్ఢా, ఒక్కసారిగా కమలం తీర్థం పుచ్చుకోవడం వెనుక పార్టీ అంతర్గత విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆప్ నాయకత్వం చడ్ఢాను రాజ్యసభలో 'డిప్యూటీ ఫ్లోర్ లీడర్' పదవి నుంచి తొలగించడం ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనికి తోడు పార్టీ ప్రస్తుతం అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించడం కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఉద్దేశించినదేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆప్కు మిగిలింది ముగ్గురే!
ఈ భారీ చీలికతో రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం కేవలం ముగ్గురికి పడిపోయింది. విపక్ష కూటమి 'ఇండియా' (INDIA) కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదం సమయంలో ఇప్పుడు బీజేపీకి మార్గం మరింత సుగమం కానుంది.












Click it and Unblock the Notifications