కరోనా.. మరో వేవ్ రావొచ్చు?
కరోనా వైరస్ పూర్తిగా మన అదుపులోకి వచ్చింది అనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB కలవరం పుట్టిస్తోంది. ఇది మరోవేవ్కు దారితీయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల టీకా తయారీదారుల నెట్వర్క్ వార్షిక సాధారణ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సబ్ వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం 300కు పైగా ఒమిక్రాన్ సబ్వేరియంట్లు ఉన్నాయని, వాటిల్లో ముఖ్యంగా XBB ఆందోళనకు గురిచేస్తోందన్నారు. రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం దీనికి ఉందని, కొన్ని దేశాల్లో మూడో వేవ్కు ఆస్కారం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే BA.5,BA.1 ఉత్పరివర్తనాలను కూడా పరిశీలిస్తున్నామని, వైరస్ పరిణామం చెందుతున్న కొద్దీ అది మరింత ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. XBB వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందన్న సమాచారం మాత్రం ఇంతవరకు రాలేదన్నారు.

ప్రతివారం 8 వేల నుంచి 9 వేల వరకు మరణాలు సంభవిస్తున్నాయని, దీన్నిబట్టి కరోనా పూర్తిగా కట్టడిలో ఉందని చెప్పలేమని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా మూడు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. పూర్తి వ్యాక్సినేషన్ కింద మూడు డోసులు కచ్చితంగా తీసుకోవాలని, రెండో డోసు తీసుకున్న 4-6 నెలల్లో బూస్టర్ వేయించుకోవాన్నారు. ఇండియాతో సహా చాలా దేశాల్లో బూస్టర్ వేయించుకోవడం తక్కువగా ఉందని, తీవ్ర వ్యాధి లక్షణాల నుంచి రక్షణ పొందేందుకు ఇప్పటికీ టీకాలు ఉపకరిస్తున్నాయని, కరోనా కేవలం ఫ్లూ అనే భావన సరికాదని హెచ్చరించారు.
దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2119 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 1.13గా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 5,28,953 కాగా, కోలుకున్నవారు 4.40 కోట్లుగా ఉన్నారు. ప్రస్తుతం 25,037 క్రియాశీల కేసులుండగా ప్రభుత్వం ఇప్పటివరకు 219.50 కోట్ల టీకాలను పంపిణీ చేసింది.












Click it and Unblock the Notifications