రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు, పార్టీ నేతపై మాయావతి వేటు
లక్నో: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విదేశీయుడని, కాబట్టి ఆయన ప్రధానమంత్రి పదవికి అనర్హుడు అని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉపాధ్యక్షులు జై ప్రకాశ్ సింగ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అధినేత్రి మాయావతి ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయనపై వేటు వేశారు.
విదేశీయురాలు తల్లి అయిన రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ఉంటారని జై ప్రకాశ్ సింగ్ అన్నారు. లోకసభ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు.
మాయావతి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోగల సత్తా తమ అధినేత్రికి మాత్రమే ఉందని చెప్పారు. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిగా చేయడంలో మాయావతి కీలక పాత్ర పోషించారన్నారు. దీంతో ఆమె దేశంలో శక్తిమంతమైన నేతగా ఎదిగారన్నారు. ఆమె దబాంగ్ (భయం లేని వ్యక్తి) అని, నరేంద్ర మోడీ, అమిత్ షాలను ఎదుర్కోగలిగే శక్తి ఆమెకు మాత్రమే ఉందన్నారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీలా కంటే తల్లి సోనియాలానే కనిపిస్తారని, ఆమె తల్లి ఓ విదేశీయురాలని, ఆయన ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మాయావతి చర్యలు తీసుకున్నారు.
జై ప్రకాశ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు కాంగ్రెస్ నేతలు నిరాకరించారు. మాయావతి మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను పదవి నుంచి తొలగించారు. ఆయన వ్యాఖ్యలు బీఎస్పీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఇథర పార్టీల నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని మాయావతి అన్నారు.
ఆయన వ్యాఖ్యలు కేవలం ఆయన అభిప్రాయం మాత్రమేనని, పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆయనను పార్టీ పదవి నుంచి తొలగించామన్నారు. దీనిపై బీజేపీ రాజ్యసభ నేత అనిల్ బలౌనీ మాట్లాడుతూ.. ప్రధాని కావాలని 44 మంది ఎంపీలు ఉన్న రాహుల్ కలలు కనవచ్చు, ఒక్క సీటు లేని మాయావతి కూడా కనవచ్చని ఎద్దేవా చేశారు.