ఎన్పీఆర్ ఎన్సీఆర్లపై పట్టు వీడండి.. నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టండి: మాయావతి
లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ పాలిత రాష్ట్రాలపై మండిపడ్డారు. జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్సీ) జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై పట్టు వీడాలని ఆమె సూచించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎలా అయితే తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకుందో అవే తప్పులను బీజేపీ చేస్తోందని మండిపడ్డారు మాయావతి. బెహెన్జీ పుట్టిన రోజు వేడుకల్లో మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలపై ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ అధికార దుర్వినియోగంకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు విధానాలతో దేశంలో గందరగోళ పరిస్థితి తలెత్తిందని ఆమె అన్నారు. అంతేకాదు శాంతిభద్రతలు కూడా దేశవ్యాప్తంగా అదుపు తప్పాయని హింస పేట్రేగిపోతోందని మాయావతి మండిపడ్డారు.
గతంలో కాంగ్రెస్ కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు విధానాలు తీసుకోవడం వల్లే ప్రజలు వారిని ఇంటికి పంపారని హస్తం పార్టీ అడుగు జాడల్లోనే బీజేపీ పయనిస్తున్నందున ఆ పార్టీ కూడా భారీ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని ముందు ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాలని మాయావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా గాడి తప్పిందని ఇలాంటి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం కనుగొనడం మానేసి దేశంలో హింస పెచ్చుమీరేలాంటి విధానాలు ప్రభుత్వం తీసుకొస్తోందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఒక క్యాపిటలిస్ట్ ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని మాయావతి ధ్వజమెత్తారు.
ఉత్తర్ ప్రదేశ్లో యోగీ సర్కార్, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండు దొందూ దొందే అని చెప్పిన మాయావతి... రెండు ప్రభుత్వాలు పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. రెండు ప్రభుత్వాలు ఇటు రాష్ట్రంలో అటు దేశవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇంతకంటే బీజేపీ ప్రభుత్వం ఏమి చేయడం లేదని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కూడా మాయావతి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. రాజస్థాన్లో తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలో సీఏఏకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశంకు మాయావతి డుమ్మా కొట్టారు.