భారత్లో ఒబామా పర్యటన ఖర్చు: వివరాలు వెల్లడించలేమన్న విదేశాంగ శాఖ
ముంబై: ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవాలకు గాను ముఖ్య అతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ఇండియా పర్యటనలో ఎంత మొత్తం ఖర్చయిందన్న విషయాన్ని వెల్లడించలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని, ముంబైకి చెందిన అనిల్ అగర్వాల్ అనే కార్యకర్త వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, దీనికి సమాధానం ఇవ్వలేమని విదేశాంగ చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ రోహిత్ రతీష్ తెలిపారు.
ప్రతి ఏడాది భారత్కు ఎంతో మంది అతిథులు, వివిధ దేశాలకు చెందిన దేశాధ్యక్షులు వస్తుంటారని, వారికి బస, సెక్యూరిటీ, రక్షణ ఏర్పాట్లను చూసుకోవాల్సిన బాధ్యత భారత్పై ఉంటుందని తెలిపారు. అంతే కాదు ఒక్కో దేశాధినేత లేదా అతిథి భారత్కు వచ్చినప్పుడు పర్యటన తీరును బట్టి ఖర్చు ఒక్కోరకంగా ఉంటుందని పేర్కొన్నారు.
2005 నాటి సమాచార హక్కు చట్టం సెక్షన్ 8(1)(సి) ప్రకారం సున్నిత విషయాల్లో రహస్యాన్ని కొనసాగించవచ్చన్న నిబంధనను ఆయనకు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతినే విషయాలను బయటకు వెళ్లడించడం కుదరదని తెలిపారు.
ఒబామా పర్యటనకు అయిన ఖర్చుతో పాటు, ఆయనకు భద్రతగా ఎంతమంది వచ్చారు? ఆయన రక్షణ కోసం భారత్ ఎంత మంది సైన్యాన్ని వినియోగించింది? లాంటి ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకపోవడంపై అనిల్ అగర్వాల్ కాస్త నిరాశ చెందారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందే పారదర్శకత, జవాబుదారీతనం లాంటి హామీలను ఎన్నికల్లో ఇవ్వడం వల్లేనని, అలాంటి హామీలను గాలికి వదిలేసిందని అనిల్ అగర్వాల్ ఆరోపించారు. పన్నుల రూపంలో సామాన్యుల వద్ద నుంచి డబ్బు రాబడుతున్న ప్రభుత్వం, ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టారనే ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడంలేదని మండిపడ్డారు.