మైనర్లను రేప్ చేస్తే ఉరి: న్యాయవాది పోరాటానికి దిగొచ్చిన కేంద్రం, ఎవరీ శ్రీవాస్తవ?
న్యూఢిల్లీ: మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని కేంద్రం తీసుకొన్న నిర్ణయం వెనుక అలఖ్ అలోక్ శ్రీవాస్తవ కీలకపాత్ర పోషించారు. పోక్సో చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తెచ్చింది.ఈ ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 21న ఆమోదం తెలిపింది.
మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ ఆలోక్ శ్రీవాస్తన నుండి వచ్చింది. ఢిల్లిలో ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్తో శ్రీవాస్తవ కోర్టును ఆశ్రయించాడు.
దీంతో ఈ విషయమై దేశ వ్యాప్తంగా చర్చ సాగింది.కథూవా రేప్ ఘటన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించింది.. ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చింది.ఈ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
న్యూఢిల్లీలోని లా యూనివర్శిటీ నుండి గోల్డ్ మెడల్ సాధించిన అలోక్ తొలుత హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలో కొన్నాళ్లపాటు పనిచేశారు. అనంతరం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్హెచ్ కపాడియా సలహామేరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అలా మొట్టమొదటిసారి చత్తీస్గఢ్లో ఎనిమిదేళ్ల బాలికపైన జరిగిన అత్యాచారం కేసును వాదించారు. ఇందులో నిందితుడైన బాధితురాలి మేనమామకు 10ఏళ్లజైలు శిక్ష పడేలా చేశారు.
డిల్లీలో ఎనిమిది నెలల చిన్నారిపై సమీప బంధువు చేసిన అత్యాచార ఘటన గురించి అలోక్ వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్నారు. దీంతో వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లి చిన్నారి తల్లిదండ్రులను కలిసి ఘటన గురించి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఈకేసును తానే వాదించనున్నట్లు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. మైనర్ బాలికలపై అత్యాచారం చేసేవారికి మరణశిక్ష విధించాలంటూ సుప్రీంను ఆశ్రయించారు.
దీనికి తోడు ఇటీవల కథువా చిన్నారి దుర్ఘటన కూడా తోడవ్వడంతో ఆయన పోరాటానికి మరింత బలం వచ్చింది. మైనర్లపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష వేయాలని కొద్దిరోజుల క్రితం కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ కేంద్రానికి ప్రతిపాదించారు. దీనికి దేశవ్యాప్తంగా మద్దతు లభించడంతో లైంగిక నేరాల నుంచి చిన్నారుల పరిరక్షణ చట్టం(పోక్సో)ను సవరించి నిందితులకు ఉరిశిక్ష పడేలా శనివారం కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అలా అలోక్ ఆలోచన కార్యరూపం దాల్చింది.