కాశ్మీర్ ఎన్నికల్లో వ్యూహం మార్చిన మెహబూబా..! కాంగ్రెస్-ఎన్సీ దూకుడుతోనే ?
పదేళ్ల విరామం తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ తో కూడిన ఇండియా కూటమి, ఇంకోవైపు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ పోటీ పడుతున్నాయి. ఇందులో జమ్మూ ప్రాంతంలో బీజేపీకి, కశ్మీర్ లోయలో మిగతా పార్టీలకు ఆధిక్యం దక్కే పరిస్దితులు కనిపిస్తున్నాయని ఇప్పటికే ముగిసిన రెండు విడతల ఓటింగ్ సరళి చెబుతోంది.
ఈ నెల 18, 25 తేదీల్లో రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 40 సీట్లకు అక్టోబర్ 1న పోలింగ్ జరగబోతోంది. దీంతో తొలి రెండు విడతల్లో వెనుకబడిన పీడీపీ రూటు మారుస్తోంది. ఇప్పటివరకూ స్దానిక అంశాలతో పాటు జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఆర్టికల్ 370 రద్దు వెనక్కి తీసుకోవడం వంటి డిమాండ్లు మాత్రమే చేస్తున్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పుడు లోయలో భారీ సంఖ్యలో ఉన్న ముస్లింల మద్దతు కోసం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ముఖ్యంగా రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన లెబనాన్ హిజ్బుల్లా సంస్ధ ఛీఫ్ హసన్ నస్రల్లా మరణానికి సంతాపం తెలపడంతో పాటు ఒకరోజు ఎన్నికల ప్రచారం రద్దు చేసుకుని మరీ భారీ ర్యాలీ నిర్వహించారు. అంతే కాదు పాలస్తీనా, లెబనాన్ ప్రజలకు అండగా నిలుస్తామని ఆమె ట్వీట్ కూడా చేశారు. తద్వారా ఇక్కడి ముస్లింలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్లుండి జరిగే 40 సీట్ల ఎన్నికల్లో కశ్మీర్ లోయలో 16 సీట్లు ఉన్నాయి. వీటిని టార్గెట్ చేస్తూ ముఫ్తీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. బంగ్లాదేశ్ లో హిందువులు చనిపోతుంటే మాట్లాడని ముఫ్తీ ఇప్పుడు ఎక్కడో లెబనాన్ లో తీవ్రవాద సంస్ధ ఛీఫ్ చనిపోతే సంతాపంగా ప్రచారం రద్దు చేసుకుని సంతాపం తెలియజేయడమేంటని ప్రశ్నిస్తోంది. అయితే ముఫ్తీ మాత్రం ఇవన్నీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు.












Click it and Unblock the Notifications