ఏకపక్ష కాల్పుల విరమణ: ఒప్పుకునేది లేదని సీఎం ముఫ్తీకీ బీజేపీ ఝలక్
శ్రీనగర్: రంజాన్ మాసంలో ఏకపక్షంగా కాల్పుల విరమణ పాటిద్దామని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముప్తీ ప్రకటించగా, దీనిని జమ్ము కాశ్మీర్ బీజేపీ తిరస్కరించింది.
ఈ సమయంలో ఏకపక్ష కాల్పుల విరమణకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని ముఫ్తీ వెల్లడించారు. కానీ దానిని బీజేపీ కొట్టి పారేసింది. అలా ఏకపక్షంగా కాల్పుల విరణ పాటిస్తే భారత ఆర్మీ ఇప్పటి వరకు పడిన కష్టం వృథా అవుతుందని బీజేపీ చెబుతోంది.
ఏకపక్ష కాల్పుల విరమణను ప్రజలు కోరుకోవడం లేదని, తాము దానిని వ్యతిరేకిస్తున్నామని బీజేపీ జమ్ము కాశ్మీర్ అధికార ప్రతినిధి సునీల్ చెప్పారు. ఈ విషయంలో ముఫ్తీ తమపై ఒత్తిడి చేయలేరన్నారు.
2000 సంవత్సరంలో వాజపేయి ప్రభుత్వం కాల్పలు విరమణను అమలు చేసిందని, ఆ తరహాలోనే ఈ దఫా కూడా కాల్పుల విరమణ పాటించాలని మనమంతా కేంద్రాన్ని కోరాలని, కేంద్రం దీనిపై ఆలోచించాలని, తద్వారా సామాన్యులు కాస్త ఊరట పొందుతారని ముఫ్తీ బుధవారం అన్నారు.
ఓ వైపు రంజాన్, మరోవైపు అమర్నాథ్ యాత్ర సందర్భంగా ప్రజలు మంచి వాతావరణంలో పండుగ జరుపుకునేందుకు వీలవుతుందన్నారు. అయితే, ఏకపక్ష కాల్పుల విరమణతో మనం నష్టపోతామని, సైన్యం పడిన కష్టం వృథా అవుతుందని బీజేపీ చెబుతోంది. మరోవైపు, ఏకపక్ష కాల్పుల విరమణకు సంబంధించి తమకు ఏ ప్రతిపాదన రాలేదని కేంద్ర హోంశాఖ అధికారి చెప్పారు.