నా దేహం రోగాల పుట్ట. కోర్టు విచారణకు రాలేనన్న మెహుల్ చోక్సీ
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెట్టిన కేసులో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీని లండన్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న మరో నిందితుడు మెహుల్ చోక్సీని తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన చోక్సీ ముంబైలోని మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాడు.

నా దేహం రోగాల పుట్ట
పంజాబ్ నేషనల్ స్కాం లో కీలక నిందితుడైన గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ కన్నా ముందే దేశం వదలి పారిపోయాడు. అప్పటి నుంచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. ఆయనను భారత్ కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరం కావడంతో.. తన దేహం రోగాల పుట్ట అని, పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తాను కోర్టు విచారణకు రాలేనని పిఎంఎల్ ఏ కోర్టులో పిటీషన్ వేశారు. గుండె సంబంధిత వ్యాధి, కాలిలో నొప్పు, మెదడులో గడ్డ తదితర రుగ్మతలతో బాధపడుతున్నానని అందులో పేర్కొన్నాడు. మెడికల్ రిపోర్టులు, డాక్టర్ల రిపోర్టులు, ఇతర డాక్యుమెంట్లతో కలిపి మొత్తం 38 పత్రాలను చోక్సీ లాయర్లు సాక్ష్యంగా కోర్టుకు సమర్పించారు. దీనిపై కోర్టు త్వరలోనే విచారణ జరపనుంది.
ఈడీ పిటీషన్ పై విచారణ
ప్రస్తుతం పీఎన్ బీ స్కాంలో నిందితులైన నీరవ్ మోడీతో పాటు అతని మామ మెహుల్ చోక్సీని ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్ గా గుర్తించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటీషన్ పై పీఎంఎల్ ఏ కోర్టు విచారణ జరుపుతోంది. ఒకవేళ కోర్టు ఈడీకి అనుకూలంగా తీర్పు ఇస్తే ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ చట్టం కింత మెహుల్ చోక్సీ ఆస్తుల్ని జప్తు చేసే వీలు కలుగుతుంది. ఇదిలా ఉంటే చోక్సీకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం చట్టవిరుద్దమని ఆయన తరఫు లాయర్లు వాదిస్తున్నారు. ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications