బెంగళూరులో ఎల్లో అలర్ట్, 48 గంటలు అంతే, బయటకు వెళితే జాగ్రత్త !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అలాగే రానున్న 48 గంటలపాటు బెంగళూరు నగరంలో కుండపోత వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరులో వాతావరణ శాఖ రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది.
మే 31వ తేదీ, జూన్ 1వతేదీలలో బెంగళూరు నగరంలో వర్షం ఎక్కువగా పడుతుందని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు వచ్చే వర్షం కుండపోతగా కురుస్తుంది వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

బెంగళూరు నగరంలో సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత విస్తారంగా వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీల నుంచి 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రెండు రోజులుగా బెంగళూరులో విపరీతమైన వానలుపడ్డాయి. ఆదివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు కురిసిన వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమైంది. గంటల తరబడి కురిసిన వర్షానికి చెట్లు నేలకూలి రోడ్డు మీదపడటంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు, వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రోడ్ల నిండా నీరు ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లో సమస్య తలెత్తింది.

బెంగళూరు నగర, బెంగళూరు గ్రామీణ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. బెంగళూరుతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లా, చిక్కమగళూరు, హాసన్, కొడగు, శివమొగ్గ జిల్లాలతో పాటు, తీరప్రాంతాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గదగ్, బెళగావి, విజయపుర, బాగల్కోట్, ధారవాడ, హవేరి, బళ్లారి, చిత్రదుర్గ, దావణగెరె, మండ్య, మైసూర్, హాసన్, తుమకూరు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications