జనం పడిగాపులు: కీలక ప్రకటన విడుదల చేసిన రామ్మోహన్ నాయుడు
Windows: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసులు స్తంభించిపోయాయి. గ్లోబల్ అవుటేజ్ ఏర్పడింది. ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్ విండోస్, ల్యాప్టాప్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా సహా అనేక దేశాల్లో విండోస్ 10 సాఫ్ట్వేర్ మొత్తం క్రాష్ అయింది. ఉన్నట్టుండి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ పని చేయడం మానేశాయి.
పర్సనల్ కంప్యూటర్లో సమస్యలు తలెత్తాయని, రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందంటూ బ్లూ స్క్రీన్ మెసేజ్ ప్రత్యక్షం కావడం వినియోగదారులకు కలవరపాటుకు గురి చేసింది. రీస్టార్ట్ చేసినా మళ్లీ మళ్లీ అదే స్క్రీన్ కనిపించడం యూజర్లు ఆందోళనకు గురయ్యారు. చాలామంది యూజర్లు తమ బ్లూ స్క్రీన్కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీనికి కారణాలు లేకపోలేదు. కొత్త క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ అసంపూర్తిగా లోడ్ కావడం, విండోస్ 10 సాఫ్ట్వేర్ దీనికి సపోర్ట్ చేయకపోవడం, అన్-ఇన్స్టాల్ మెసేజీలు రావడం వంటి కారణాల వల్ల బ్లూ స్క్రీన్ ప్రత్యక్షమౌతున్నట్లు అంచనా వేస్తోన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ కావడం విమాన సర్వీసులపైనా తీవ్ర ప్రభావం చూపింది. తీవ్రంగా అస్తవ్యస్తం అయ్యాయి.
దీని ప్రభావం భారత్పైనా పడింది. విమానాల రాకపోకలకు సంబంధించిన సమాచారం ఏ ఎయిర్పోర్టులో కూడా డిస్ప్లే కావట్లేదు. ఏ విమానం ఎన్ని గంటలకు బయలుదేరుతుంది?, ఏ సర్వీస్ ఎన్ని గంటలకు అందుబాటులో ఉంటుంది?, ఏ ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుందో తెలియని పరిస్థితులు విమానాశ్రయాల్లో నెలకొన్నాయి.
సర్వీస్ ప్రొవైడర్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యల వల్ల బుకింగ్, చెక్-ఇన్ సహా ఆన్లైన్ సేవలు కొన్ని తాత్కాలికంగా అందుబాటులో ఉండట్లేదని భారత్కు చెందిన ఆకాశ, ఇండిగో, స్పైస్జెట్.. వంటి పలు పౌర విమానయాన సంస్థలు వెల్లడించాయి. విమానాశ్రయాల్లో మాన్యువల్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నాయి.
దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ల కార్యకలాపాలు ప్రభావితం అయ్యాయి. గ్లోబల్ ఐటీ అవుటేజ్ వల్ల విమానయాన సంస్థల సేవలు ప్రభావితం అయ్యాయని పేర్కొన్నాయి. ఫ్లైట్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలిపాయి.
ఫలితంగా- ప్రయాణికులు ముందుగానే ఎయిర్పోర్టులకు చేరుకుంటోన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత రద్దీ నెలకొంది. కనీసం కూర్చోవడానికి కూడా సరైన వసతి లేని పరిస్థితులు విమానాశ్రయాల్లో నెలకొన్నాయి.
దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. పౌర విమానయాన సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని సూచించారు.
విమానాల ఆలస్యం వల్ల దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోన్న విషయం తన దృష్టికి వచ్చిందని, తక్షణమే వారికి అదనపు సీటింగ్, మంచినీరు, ఆహారాన్ని అందించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. వారికి సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని సూచించానని అన్నారు.












Click it and Unblock the Notifications