ఢిల్లీ బోర్డర్లో అర్ధరాత్రి హైడ్రామా.. వెనక్కి తగ్గని రైతులు.. చంపే కుట్ర అన్న రాకేశ్ టికాయిత్...
ఢిల్లీ సరిహద్దుల్లో గురువారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. వేలాదిగా రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు సరిహద్దుల్లో నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించాయి. అయితే రైతులు పోలీసులకు ఎదురొడ్డి నిలబడ్డారు... నిరసన ప్రదేశాన్ని ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరగక తప్పలేదు. అంతముందు రైతులు నిరసన చేస్తున్న ప్రదేశాలకు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. కానీ పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత విద్యుత్ను మళ్లీ పునరుద్దరించారు.
వెనక్కి తగ్గని రైతులు...
ఢిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపూర్లో ఆందోళనలు విరమించుకోవాలని... ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైతు సంఘాలకు నోటీసులు పంపింది. ఆ ప్రదేశంలో నీళ్లు,విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఘాజీపూర్ బోర్డర్ను ఖాళీ చేయకపోతే పోలీసులను రంగంలోకి దింపుతామని హెచ్చరించింది. చెప్పినట్లుగా అర్ధరాత్రి దాదాపు వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దించింది. అయితే రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులే వెనుదిరగక తప్పలేదు.
భారీగా చేరుకుంటున్న రైతులు...
భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) పిలుపుతో పశ్చిమ యూపీ జిల్లాలైన బులంద్ షహర్,బిజ్నోర్,ముజఫర్నగర్,మొరదాబాద్,మేరఠ్,బాగ్పత్ల నుంచి శుక్రవారం (జనవరి 29) తెల్లవారుజామున వేలాది మంది రైతులు యూపీ గేట్ వద్దకు చేరుకున్నారు. ఘాజీపూర్లో పోలీస్ బలగాలను దించిన ప్రభుత్వం త్వరలోనే సింఘు,టిక్రీ బోర్డర్లోనూ బలగాలను దింపుతుందని.. కాబట్టి రైతులు వేలాదిగా తరలివచ్చి ఉద్యమంలో పాల్గొనాలని బీకేయూ పిలుపునిచ్చింది. అటు జింద్-చంఢీగఢ్ హైవేను రైతులు బ్లాక్ చేశారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Recommended Video
చంపేందుకు కుట్ర చేస్తున్నారు : రాకేశ్ టికాయిత్
బీకేయూ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఉద్వేగానికి లోనయ్యారు. రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని... 3లక్షల మంది పోలీసులు,లాఠీలు,తుపాకులతో తమను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు,రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని... అవసరమైతే బుల్లెట్లను ఎదుర్కోవడానికి కూడా సిద్దమేనని ప్రకటించారు.