లాక్డౌన్ రోజులు గడిచేకొద్దీ.. పోలీసులకు సరికొత్త సవాల్: గందరగోళం: సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లేనా?
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితులు క్రమంగా ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. లాక్డౌన్ రోజులు గడిచే కొద్దీ పోలీసులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏ ముహూర్తంలో నిర్ణయం తీసుకుందో గానీ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీసులపై దాడులకు కారణమౌతున్నాయి. గందరగోళ పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అధికారులు మధ్య సమన్వయం లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం.. ఇలాంటి సంఘటనలకు కారణమౌతోందని అంటున్నారు.

ఏపీ, తెలంగాణ, గుజరాత్ తరహాలో..
ఏపీ, తెలంగాణ, గుజరాత్లల్లో వలస కార్మికులు పోలీసులపై యథేచ్ఛగా దాడులు చేశారు. రాళ్లను సైతం రువ్వడానికి వెనుకాడలేదు. పోలీసుల వాహనాలను సైతం ధ్వంసం చేసిన సంఘటనలు ఇదివరకే చోటు చేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హైదరాబాద్ క్యాంపస్లో తొలిసారిగా వలస కార్మికులు పోలీసులపై దాడులు చేశారు. వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ తరువాతే కేంద్ర ప్రభుత్వం కదిలిన విషయం తెలిసిందే. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడానికి అవసరమైన చర్యలను తీసుకున్నది ఆ ఘటన తరువాతే.

పశ్చిమ గోదావరి, సూరత్లల్లో దాడులు..
సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో అదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని కొవ్వూరు పట్టణంలో వందలాది మంది వలస కార్మికులు రోడ్డెక్కి, ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ఘర్షణలకు దిగారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇదే తరహా ఉదంతం గుజరాత్లోని సూరత్లో సంభవించింది. దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ సూరత్ పోలీసులతో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వారు.

తాజాగా బెంగళూరులో ఉద్రిక్తత..
తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ వాటికి ఏమాత్రం తీసిపోని ఉదంతం నమోదైంది. బెంగళూరులోని క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వేస్టేషన్, యశ్వంత్పురా స్టేషన్లకు చేరుకున్న అయిదువేల మంది వలస కార్మికులు ఒక్కసారిగా బెంగళూరు నగర పోలీసులపై తిరగబడ్డారు. రైల్వేస్టేషన్లకు చేరుకున్న తమను పోలీసులు క్వారంటైన్కు తరలిస్తారనే వదంతులు వ్యాపించడంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. క్వారంటైన్కు పంపించబోమని, ప్రస్తుతానికి రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల వెనక్కి వెళ్లాలని సూచించినప్పటికీ.. వారు వినిపించుకోలేదు. రాళ్లు రువ్వారు. ఫలితంగా ఎస్ఐ సహా నలుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లేనా?
వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక సరైన ప్రణాళిక లేదని, అందుకే- గందరగోళం తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి మార్గదర్శకాలను కేంద్ర హో మంత్రిత్వ శాఖ జారీ చేసినప్పటికీ.. వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైందని అంటున్నారు. ఫలితంగా- క్షేత్రస్థాయిలో లాక్డౌన్ డ్యూటీల్లో ఉన్న పోలీసులకు ఇబ్బందులను సృష్టిస్తోందనే విమర్శలు ఉన్నాయి. వలస కార్మికులను ఉన్నపళంగా స్వస్థలాలకు తరలించే వీలు కల్పించడం వల్ల రాష్ట్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని, ఫలితంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications