ఏయ్ రాస్కెల్.. నోర్ముయ్.!: మహిళతో మంత్రి దురుసు, సీఎం వార్నింగ్, క్షమాపణ
బెంగళూరు: తన వద్దకు వచ్చి సమస్యను చెప్పుకుంటున్న ఓ మహిళను దూషించారు కర్ణాటక మంత్రి జేసీ మధుస్వామి. ఇందుకు సంబంధించిన వీడియో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు చేరడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కావద్దంటూ హెచ్చరించారు. దీంతో సదరు మంత్రి మహిళకు క్షమాపణలు చెప్పారు.

ఏయ్ రాస్కెల్.. నోర్ముయ్..
కోలార్ జిల్లాలోని కేసీ వ్యాలీ ప్రాజెక్ట్ పంప్ హౌస్ను తనిఖీ చేసేందుకు మంత్రి మధుస్వామి బుధవారం వెళ్లారు. ఈ క్రమంలో ఓ మహిళ మంత్రి వద్దకు వచ్చి ట్యాంకులు ఆక్రమణకు గురవుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి ఆగ్రహానికి గురయ్యారు. ఏయ్ రాస్కెల్.. నోర్ముయ్ అంటూ ఒక్కసారిగా ఆమెపైకి లేచారు. ఈ క్రమంలో మంత్రి ఆదేశాలతో ఆ మహిళను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. కాగా, రాజ్య రైత సంఘ, హసిరు సేనేకు చెందిన సభ్యులు మంత్రి మధుస్వామిని ఘెరావ్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత వారిని పోలీసులు అక్కడ్నుంచి తరలించారు. అదే సమయంలో ఈ మహిళ వచ్చి ఫిర్యాదు చేయడంతో ఆమెపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సీఎం ఆగ్రహం.. వార్నింగ్..
కాగా, మంత్రి ఆ మహిళను దూషించిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఎం యడ్యూరప్ప దృష్టికి ఈ ఘటన వెళ్లడంతో మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మధుస్వామి చేసిన పని ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. సదరు మహిళతో తాను మాట్లాడుతానని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వద్దంటూ మంత్రిని గట్టిగా హెచ్చరించినట్లు సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి మధుస్వామి సదరు మహిళకు క్షమాపణలు చెప్పారు.

మంత్రి క్షమాపణలు.. ఆమె ఎంత చెప్పినా
సదరు మహిళకు గురువారం క్షమాపణలు చెప్పిన మంత్రి మధుస్వామి ఘటనకు సంబంధించిన వివరణ ఇచ్చారు. తాను ఐదు నిమిషాలపాటు ఆ మహిళ చెబుతున్న సమస్యను విన్నానని.. సమస్యను పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అయితే, ఆమె వినకుండా పదే పదే మళ్లీ అదే విషయం చెప్పడంతో తనకు ఆగ్రహం వచ్చి అలా మాట్లాడానని చెప్పారు. తన మాటలు నొప్పించినట్లయితే ఆమెకు తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. కాగా, మంత్రి మధుస్వామితో క్షమాపణలు చెప్పిస్తే సరిపోదని, అతడ్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications