మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించిన రామ్మోహన్ నాయుడు
Delhi Airport: దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 రూఫ్ టాప్ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కొన్ని గంటలుగా ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల దెబ్బకు ఈ దుర్ఘటన సంభవించింది.
మొన్నటి వరకు రికార్డుస్థాయి ఎండ తీవ్రతతో అల్లాడిన ఢిల్లీ.. ఇప్పుడు అతి భారీ వర్షాలకు కుదేల్ అవుతోతంది. అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది.

ఈ వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే- ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైకప్పు సైతం కుప్పకూలిపోయింది. విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పైకప్పు కొంతభాగం మొత్తం భళ్లుమంటూ కుప్పకూలింది. వర్షపునీరు మొత్తం లోనికి ప్రవహించింది.
వర్షపునీటిని బయటికి తీసుకెళ్లే పైపులు పగిలిపోయాయి. నీరంతా సీలింగ్పై ప్రవహించింది. దాని బరువుగా ఒక్కసారిగా రూఫ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కార్లు ధ్వంసం అయ్యాయి. రూఫ్ సపోర్టింగ్ పిల్లర్ ఓ క్యాబ్పై పడింది. ఆ సమయంలో డ్రైవర్ కారులోనే ఉన్నారు. అతి కష్టం మీద అతన్ని బయటికి తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారీ వర్షాలు, వెలుతురు లేమి, ప్రతికూల వాతావరణం వల్ల విమానాల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు. టెర్మినల్ 1ను పాక్షికంగా మూసివేశారు. వర్షం తీవ్రత తగ్గిన తరువాత మళ్లీ విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు.
ఈ సమాచారం అందిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి 20 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి మూడు లక్షల రూపాయల చొప్పు న నష్టపరిహారాన్ని ప్రకటించారు.
రూఫ్ కుప్పకూలడంపై విచారణకు ఆదేశించారు. గాయపడ్డవారికి నాణ్యమైన వైద్య సహాయాన్ని అందించాలంటూ అధికారులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఘటనపై సమగ్ర నివేదికను రూపొందిస్తోందని అన్నారు.
అన్ని విమానాశ్రయాలకు సంబంధించిన నిర్మాణాల బ్లూప్రింట్ను తెప్పించుకుంటామని, ఇలా బలహీనంగా ఉన్న వాటిని పునర్నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతానికి టెర్మినల్ 1ను మూసివేశామని, టీ2, టీ3 నుంచి రాకపోకలు సాగిస్తోన్నట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు.












Click it and Unblock the Notifications