అచ్చం స్వాతి ఘటనలాగే: బాలికపై రేప్, ఆపై హత్య
చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ ఉదంతాన్ని మరిచిపోక ముందే తమిళనాడులో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని శివగంగ జిల్లా మానామదురైలో పాతికేళ్ల యువకుడు బాలికపై అత్యాచారం జరిపి, ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
మానామదురైలోని గణపతినగర్కు చెందిన కరుప్పయ్య, జయ దంపతుల కుమార్తె కాళీశ్వరి(11) మేల్నెట్టూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. భర్త మరణించడంతో జయ కూలిపనులు చేసుకుంటు కుమార్తెను చదివిస్తోంది.
సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన కాళీశ్వరి సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో జయ పాఠశాలలో వాకబు చేసింది. అయితే ఆమె ఇంటి సమీపంలో నివాసముంటున్న లారీ డ్రైవర్ కార్తీక్ (25) మోటార్ సైకిల్పై వెళ్లినట్లు తోటి విద్యార్థులు చెప్పారు.
వెంటనే జయ కార్తీక్ను సెల్ఫోన్లో సంప్రదించగా.. తానే కాళీశ్వరిని కిడ్నాప్ చేశానని, ఆమెను చంపేసి రహస్య ప్రదేశంలో పూడ్చి పెట్టానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో భయాందోళనలకు గురైన జయ మానామదురై పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ కోసం గాలించారు.
సాయంత్రానికి ఊరి బయట వున్న చెరువు గట్టున గొంతు కోసుకుని ప్రాణాపాయ స్థితిలో వున్న కార్తీక్ను గుర్తించిన పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో విషం బాటిల్, కత్తి వుండడంతో అతను ఆత్మహత్యకు యత్నించి వుంటాడని అనుమానిస్తున్నారు.
రాత్రంతా బాలిక మృతదేహం కోసం గాలించిన పోలీసులకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమెను పూడ్చి పెట్టిన స్థలం కనిపించింది. భౌతికకాయాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ కాళీశ్వరిపై అత్యాచారం జరిపి, ఆమె ఆ విషయాన్ని బయటకు చెబుతుందనే భయంతో హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం కార్తీక్ తిరునల్వేలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.