రేప్ చేసి ఎముకలు విరిచి అమ్మాయిని చంపేశారు
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పదినేళ్ల దళిత బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఎముకలు విరిచి, చిత్రహింసలు పెట్టి అమ్మాయిని ఆ కామాంధులు పొట్టన పెట్టుకున్నారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని పోకర్ది గ్రామంలో ఈ ఘోరమైన సంఘటన జరిగింది. జులై 13న జితేంద్ర షిండే, సంతోశ్ భవల్, నితిన్ ధైల్యుం అనే వ్యక్తులు ఆ దారుణానికి ఒడిగట్టారు. మర్నాడు పోలీసులు షిండేను అరెస్టు చేశారు. మిగతా ఇద్దరిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు. షిండే కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా మిగతా ఇద్దరితో కలిసి మద్యం సేవిస్తూ పార్టీ చేసుకుంటున్న సమయంలో తాతయ్యను కలిసి వస్తున్న బాలికపై వారి దృష్టి పడింది.
ఆ ముగ్గురు ఆమెపై అత్యాచారం చేసారు. చిత్రహింసలు పెట్టి, ఒళ్లంతా గాయాలు చేసి చివరికి గొంతు పిసికి హత్య చేశారు. దాడి వల్ల బాలిక రెండు భుజాల్లోని ఎముకలు దెబ్బ తిన్నాయని అహ్మద్నగర్ సౌరభ్ త్రిపాఠి తెలిపారు. శరీరమంతా గాయాలై, ముక్కునుంచి రక్తం కారుతూ వివస్త్రగా ఉన్న బాలికపై షిండే పశుబలం చూపిస్తుండగా ఓ గ్రామస్తుడు గమనించి కేకలు వేశాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతన్ని తోసేసి షిండే పారిపోయాడు.
ఆస్పత్రికి తరలించేలోపే బాలిక ప్రాణాలు కోల్పోయిందని పోలీసు అధికారి తెలిపారు. ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడంతో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షిండే, మంత్రి రామ్ షిండేతో కలిసి ఉన్న ఫొటోలు ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి.
దీంతో సంఘటన రాజకీయ రంగు పులుముకుంది. మంత్రికి, నిందితుడికి ఉన్న సంబంధం ఏమిటో తేల్చాలని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన తేనీటి విందును సైతం బహిష్కరించాయి.
దిగివచ్చిన ముఖ్యమంత్రి ఈ కేసు పూర్వాపరాలు తేల్చాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్కి సూచించారు. అయినా శాంతించని విపక్షాలు హోంశాఖ కూడా నిర్వహిస్తున్న ఫడ్నవీస్ ఈ దారుణ సంఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.