విరిగిన చక్రం: గంటకు 110కిమీ స్పీడ్తో శతాబ్ధి ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేల్లో అత్యధిక వేగంగా ప్రయాణించే రైళ్లలో శతాబ్ధి ఎక్స్ప్రెస్ ఒకటి. ఈ రైలు సోమవారం ఓ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ సమయంలో రైలులో సుమారు 300 మంది ప్రయాణీలు ఉన్నారు. వీరిలో కొంత మంది విదేశీ పర్యాటకలు కూడా ఉన్నారు.
సోమవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అజ్మీర్కు శతాబ్ధి ఎక్స్ప్రెస్ బయలుదేరింది. జైపూర్ కు 40 కిలోమీటర్ల దూరంలోని బోబాస్ స్టేషన్ వద్దకు చేరుకునే ముందు, అందులో ఏదో లోపమున్నట్లు గేట్ మన్ కలూరాం గుర్తించారు.
వెంటనే సమాచారాన్ని స్టేషన్ మాస్టర్ రామావతార్కు చేరవేశారు. అప్పటికే ఆ రైలు జెట్ స్పీడ్ తో బోబాస్ స్టేషన్ ను దాటేసింది. వెంటనే రామావతార్ సూపరింటెండెంట్ కలురాం మీనాను అప్రమత్తం చేశారు. తర్వాతి స్టేషన్ అసాల్పూర్- జోబ్నర్ వద్ద రైలును నిలిపేశారు.
తీరా పరిశీలిస్తే, రైలులోని ఓ చక్రం సగం మేర విరిగిపోయింది. ఇలా విరిగిన చక్రంతోనే రైలు 8 కిలోమీటర్లు పరుగులు చేసింది. వెంటనే సంబంధిత బోగీని తొలగించారని నార్త్ వెస్టర్న్ రైల్వే సీపీఆర్ఓ తరుణ్ జైన్ మంగళవారం వెల్లడించారు. ప్రమాదం జరిగిన కోచ్ జనరేటర్కు సంబంధించిందని, అందులో ప్రయాణీకులు ఉండరని వివరించారు.
రైలు బయలుదేరేముందు న్యూఢిల్లీలో సిబ్బంది, పూర్తి స్థాయిలో జరిపిన పరిశీలనలో ఈ లోపం వెలుగుచూడకపోవడం గమనార్హం. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని నార్త్ వెస్టర్న్ రైల్వే తెలిపింది.