మహిళా టెక్కీ అదృశ్యం, అనుమానాస్పద స్థితిలో మృతి
చెన్నై: మహిళా సాఫ్టువేర్ ఉద్యోగి ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టిసిఎస్లో పని చేస్తున్న ఉమ అనే ఇరవై నాలుగేళ్ల యువతి గత వారం అదృశ్యమైంది. శనివారం రోజు ఆమె పని చేస్తున్న కార్యాలయానికి సమీపంలోనే విగత జీవిగా కనిపించింది.
సేలం జిల్లాకు చెందిన ఉమా మహేశ్వరి సిరుసెరిలోని టిసిఎస్లో ఇటీవలే చేరింది. వారం రోజుల నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
శనివారం ఆమె మృతదేహం కార్యాలయానికి సమీపంలో గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పంపించారు. మృతదేహంపై పెనుగులాటకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేవని చెబుతున్నారు.
ఉమా మహేశ్వరి సంస్థకు చెందిన వాహనంలోనే కార్యాలయానికి వెళ్లేది. అదృశ్యమైన రోజు మాత్రం అందులో ఎక్కలేదు. ఆమె మొబైల్ ఫోన్ స్విచ్చాప్ చేసి ఉంది. దీంతో సమాచారం అందలేదు. ఆమె మృతదేహం కార్యాలయానికి రెండువందల మీటర్ల దూరంపో గుర్తించారు.
ఉద్యోగం చేస్తున్న ఆమె స్నేహితులతో కలిసి మేడవక్కం ప్రాంతంలో ఓ గదిని కిరాయికి తీసుకొని ఉంటున్నారు. ఆమె అదృశ్యమైన రోజు (ఫిబ్రవరి 13)న చివరిసారిగా రాత్రి పదిన్నర గంటలకు స్నేహితులకు కనిపించారు.
కాగా, ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఓ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసింది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుకు సరైన రీతిలో స్పందించనందున విధుల నుండి తొలగించింది.