మెహుల్ చోక్సీ ఇప్పట్లో భారత్ రానట్లే..: స్వదేశానికి భారత దర్యాప్తు బృందం, అక్కడి కేసులే కారణం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇప్పట్లో భారత్కు అప్పగించే అవకాశాలు కనిపించట్లేదు. ఆంటిగ్వా నుంచి అదృశ్యమై డొమినికా పోలీసులకు చిక్కిన చోక్సీకి సంబంధించి రెండు కేసులు అక్కడి కోర్టుల్లో విచారణ దశలో ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసుల్లో తీర్పు వచ్చేంత వరకు చోక్సీని భారత్కు పంపించే అవకాశం లేదు.

మెహుల్ చోక్సీపై డొమినికా పోలీసుల కేసు
ఈ క్రమంలో చోక్సీని భారత్ తీసుకొచ్చేందుకు వెళ్లిన భారత దర్యాప్తు సంస్థల బృందం తిరిగి స్వదేశానికి తిరుగుపయనమైంది. కాగా, మే 23న ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీని ఆ తర్వాత రెండో రోజులకు పక్కనే ఉన్న డొమినికా దేశంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చోక్సీని అక్రమంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన తరపు న్యాయవాదులు చెబుతుండగా, అక్రమంగానే ప్రవేశించారని ఆ దేశ పోలీసులు తెలిపారు.

జులై వరకు డొమినికాలోనే మెహుల్ చోక్సీ
చోక్సీ అక్రమంగా డొమినికాలో ప్రవేశించారని కేసు నమోదు చేయడంతో విచారణ జరుగుతోంది. ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీనిపై విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. మరోవైపు చోక్సీ కోసం ఆయన న్యాయవాదులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణను జులైకి వాయిదా వేసింది అక్కడి న్యాయస్థానం. దీంతో చోక్సీని భారత్ తీసుకురావడం ఇప్పట్లో సాధ్యం కాదనే తెలుస్తోంది.

స్వదేశానికి పయనమైన భారత దర్యాప్తు బృందాలు
ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి డొమినికా వెళ్లిన ఈడీ, సీబీఐ అధికారుల బృందం తిరిగి స్వదేశానికి పయనమైంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ బృందం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోనుంది. అంతకుముందు భారత్కు అప్పగించాలంటూ కోర్టులో పత్రాలు సమర్పించింది. కాగా, పీఎన్బీలో రూ. 13,500 కోట్ల మేర మోసం చేసి మెహుల్ చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. మెహుల్ చోక్సీ ఆంటిగ్వా-బార్బుడా నుంచి డొమినికా మీదుగా క్యూబా పారిపోతుండగా డొమినికా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, నీరవ్ మోడీ లండన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications