అసెంబ్లీ ఎన్నికలు: మిజోరాంలో 75 శాతానికి పైగా ఓటింగ్
ఐజ్వాల్: అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ ముగిసింది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2,899 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్ కోసం 65 వేల బూత్లు ఏర్పాటు చేశారు. మిజోరంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
40 స్థానాలకు గాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,164 బూత్ లు ఏర్పాటు చేశారు. మిజోరంలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం డెబ్బై శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది.
మిజోరం ఎన్నికల్లో యువత నుంచి వయోవృద్ధుల వరకు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మిజోరాంలో ఓటింగ్ 75 శాతం వరకు నమోదయింది. సెర్చిప్ నియోజకవర్గంలో 81 శాతం అధికంగా నమోదయింది. గురువారం పోలింగ్ శాతంపై మరింత స్పష్టత రానుంది.