సీ ఓటర్ సర్వే: మళ్ళీ మోడీదే అధికారం, ఏపీలో టిడిపికి వ్యతిరేక పవనాలు, రజనీ కింగ్ మేకర్
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోడీ నేతృత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ, సీ-వోటర్ సర్వే నిర్వహించింది. ఈ మేరకు ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు ఆ సర్వే ప్రకటించింది.
గత ఏడాది చివరి వారంలో ఈ సర్వేను నిర్వహించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 89 చోట్ల విజయం సాధించనుందని ఆ సర్వే ప్రకటించింది.ఏపీ రాష్ట్రంలో మాత్రం అధికార టిడిపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వే తెలిపింది.
తమిళనాడు రాష్ట్రంలో జయలలిత లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో రజనీకాంత్ కీలకపాత్ర పోషిస్తారని ఈ సర్వే తేటతెల్లం చేసింది.ఇప్పటివరకు బిజెపికి స్థానం లేని రాష్ట్రాల్లో కూడ బిజెపి రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది.
ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకొందని రిపబ్లిక్ టీవీ, సీ-వోటర్ సర్వే ప్రకటించింది.మొత్తం 543 స్థానాల్లో 335 సీట్లను ఈ కూటమి చేజిక్కించుకుంటుందని వెల్లడించింది.అటు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 89 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే అభిప్రాయపడింది.
ఏపీలో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు
ఏపీలో టిడిపికి రాజకీయ వాతావరణం ఇబ్బందికరంగా ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఏపీలోని 25 ఏంపీ స్థానాల్లో వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించనుంది. టిడిపి 12 స్థానాల్లో విజయం సాధించనున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో వైసీపీ అదనంగా 5 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది.తెలంగాణలోని 17 స్థానాలలో టీఆర్ఎస్ 11 , బీజేపీ 3, కాంగ్రెస్ రెండు చోట్ల, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని వెల్లడించింది.
తమిళనాడులో జయలలిత లేని లోటు కన్పించింది.
తమిళనాడులో జయలలిత లేని లోటు స్పష్టంగా కన్పిస్తోందని ఈ సర్వే అభిప్రాయపడింది.తమిళనాడు రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాల్లో రజనీకాంత్ పార్టీకి 23 సీట్లు వస్తాయని పేర్కొంది. ద్రవిడ రాజకీయాలను కాదని అన్నాడీఎంకే, డీఎంకే వంటి పక్షాలను పక్కనపెట్టి 33 శాతం తమిళ ఓటర్లు రజనీకి పట్టంగడతారని తెలిపింది. అటు డీఎంకే 14 సీట్లతో రెండో స్థానంలో అన్నాడీఎంకే రెండు చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఒకవేళ రజనీ సార్వత్రిక ఎన్నికల రంగంలోకి దిగకపోతే డీఎంకే 32 సీట్లను గెలుచుకుంటుందని.. అప్పుడు అన్నాడీఎంకే 6 సీట్లు, బీజేపీ ఒకచోట విజయం సాధిస్తాయని పేర్కొంది.
కర్ణాటక రాష్ట్రంలో కూడ
కర్ణాటక రాష్ట్రంలో కూడ బిజెపికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. కర్ణాటకలోని 28 ఎంపీ సీట్లలో బీజేపీ 22 చోట్ల, యూపీఏ 5, జేడీఎస్ ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే పేర్కొంది. మహారాష్ట్రలో మాత్రం ఎన్డీయే ఆధిపత్యానికి ఎదురు లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. మహరాష్ట్రలోని 48 సీట్లలో ఎన్డీయేకే 44 స్థానాల్లో విజయం సాధించనున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్కు 2, ఎన్సీపీకి రెండు సీట్లు దక్కుతాయని తెలిపింది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీచేస్తే ఎన్డీయేకే 35 సీట్లే రావొచ్చని అభిప్రాయపడింది.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో తగ్గనున్న సీట్లు
బిజెపి పాలిత రాష్ట్రాల్లో సీట్లతో పాటు, ఓట్ల శాతం కూడ తగ్గనుందని ఈ సర్వే ప్రకటించింది. గుజరాత్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల శాతంతోపాటు సీట్లలోనూ స్వల్ప తగ్గుదల కనబడుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీయేతర ఇతర పార్టీలు స్వల్ప ఆధిక్యాన్ని పొందే అవకాశముందని సర్వే పేర్కొంది.
ఇతర రాష్ట్రాల్లో విస్తరించనున్న బిజెపి
కొత్త ప్రాంతాల్లోకి కూడ బిజెపి విస్తరించే అవకాశం ఉందని ఈ సర్వే తేట తెల్లం చేసింది.ఒడిశాలో బిజెపి 13 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది.బెంగాల్ రాష్ట్రంలో కూడ బిజెపి 12 స్థానాల్లో విజయం సాధిస్తోందని ఈ సర్వే అంచనా వేసింది. యూపీలో ఈ సారి బీజేపీ ఆధిపత్యానికి యూపీఏ గండికొట్టనుంది. మొత్తం 80 సీట్లలో బీజేపీ 60 స్థానాలను గెలుచుకోనుండగా యూపీఏ 18 చోట్ల, ఇతరులు రెండుచోట్ల గెలుస్తారని సీ-వోటర్, రిపబ్లిక్ సర్వే వెల్లడించింది. మొత్తంమీద ఒక్క పంజాబ్లోనే ఎన్డీయే కన్నా యూపీఏ ఎక్కువ స్థానాలు గెలుచుకోనున్నట్లు సమాచారం.