మోడీ కేబినెట్: ఆ నాలుగింటిలో మార్పులేదు, ఎవరెవరికి చోటు?
న్యూఢిల్లీ: 2017.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు ఈ మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విస్తరణలో భాగంగా కొందరి మంత్రులకు హోదా పెంచడం, మరికొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈసారి మంత్రివర్గ విస్తరణలో మోడీ మార్కు కనిపిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కొత్త వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఇదే సమయంలో కీలకమైన ఆ నాలుగు శాఖల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. వీటిలో హోం శాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖలు ఉన్నాయి.
హోంశాఖ మంత్రి బాధ్యతలను రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖను అరుణ్ జైట్లీ, రక్షణ శాఖను మనోహర్ పారికర్, విదేశాంగ శాఖను సుష్మాస్వరాజ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ధికమంత్రి జైట్లీ నుంచి అదనపు శాఖల బాధ్యతలను తప్పించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను జైట్లీ నిర్వహిస్తున్నారు.

ఈ అదనపు బాధ్యతల నుంచి ఆయనను తప్పించి కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని సహా 66 మంది మంత్రులు ఉండగా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం 82 మంది వరకూ కేబినెట్లో చోటు కల్పించుకునే వీలుంది.
మోడీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా చోటు దక్కేందుకు అవకాశమున్న వారిలో శివసేనకు చెందిన అనిల్ దేశాయ్, ఆర్పీఐకి చెందిన రాందాస్ బందు అతవాలె, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్దె, సహరాన్పూర్కు చెందిన బీజేపీ ఎంపీ రాఘవ్ లఖన్పాల్, ఉత్తరప్రదేశ్ అప్నా దళ్ నాయకురాలు అనుప్రియ పటేల్, బికనీర్ బీజేపీ ఎంపీ అర్జున్ రాం మేఘ్వాల్, గుజరాత్ బీజేపీ నేత పురుషోత్తం రూపాలా, డార్జిలింగ్ బీజేపీ ఎంపీ ఎస్.ఎస్.అహ్లువాలియా, అల్మోరా బీజేపీ ఎంపీ అజయ్ తమ్తా ఉన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి, ముజఫర్ నగర్ బీజేపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ బల్యాన్కు పదోన్నతి లభించే అవకాశం ఉంది. సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి విజయ్ సంప్లా, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి విజయ్ నిహాల్ చాంద్లపై వేటు పడే అవకాశాలున్నాయి.
శర్వానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన కేంద్ర కీడా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిని వేరొకరితో భర్తీ చేయనున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు కొత్తవారికి కేబినెట్లో చోటు కల్పించవచ్చు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్కు పదోన్నతి కల్పించొచ్చనే ప్రచారం జరుగుతోంది.
పదోన్నతి లభించే వారు:
పియూష్ గోయల్: పవర్, గోల్, మైనింగ్ శాఖల మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్: పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి
ముక్తార్ అబ్బాస్ నక్వీ: మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కొత్త ముఖాలు:
అర్జున్ రామ్ మొఘల్ (లోక్ సభ, రాజస్థాన్)
PP చౌదరి (లోక్ సభ, రాజస్థాన్)
అనుప్రియా పటేల్ (లోక్ సభ, ఉత్తర ప్రదేశ్)
అనిల్ దేశాయ్ (రాజ్య సభ, మహారాష్ట్ర)
అజయ్ తమ్తా (లోక్ సభ, ఉత్తరాఖండ్)
మహేంద్ర నాథ్ పాండే (లోక్ సభ, ఉత్తర ప్రదేశ్)
కృష్ణ రాజ్ (లోక్ సభ, ఉత్తర ప్రదేశ్)
ఎస్ఎస్ అహ్లువాలియా (లోక్ సభ, వెస్ట్ బెంగాల్)
పురుషోత్తమ రూపాలా (రాజ్య సభ, గుజరాత్)
అనిల్ మాధవ్ దవే (రాజ్య సభ, మధ్య ప్రదేశ్)
మన్షుక్ భాయ్ మండివియా (రాజ్య సభ, గుజరాత్)
వేటు పడేవారు
రామ్ శంకర్ కతేరియా: మానవ వనరుల శాఖ సహాయ మంత్రి
నిహాల్ చంద్: పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి












Click it and Unblock the Notifications