మీడియా అధినేతకు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్: 43 మంది ప్రమాణం..జంబో కేబినెట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఈ సాయంత్రం 6 గంటలకు ముహూర్తం ఖాయం చేసిన నేపథ్యంలో- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం సందడిగా మారింది. ఢిల్లీ నుంచి పిలుపు అందిన నేతలందరూ హస్తినలో మకాం వేశారు. ప్రధానితో వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. రాజకీయ నేతల, వారి అనుచరుల హడావుడితో హస్తిన రహదారులు నిండిపోయాయి. ఈ ఉదయం నుంచి ప్రధాని కూడా తీరిక లేకుండా గడుపుతోన్నారు. మంత్రివర్గంలో చోటు ఖాయం చేసుకున్న నేతలతో సమావేశమౌతోన్నారు.
మరోవంక- కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన నేతలు రాజీనామాలు చేస్తోన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు సంతోష్ కుమార్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్ నిశ్శాంక్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, సంజయ్ ధోత్రె, రతన్లాల్ కటారియా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ సాయంత్రానికి మరిన్ని వికెట్లు నేలకూలే అవకాశాలు ఉన్నాయి. విస్తరణ సందర్భంగా ఉద్వాసనకు గురైన మంత్రులు తమ రాజీనామాలను సమర్పిస్తోన్నారు. ఆరోగ్య కారణాల వల్ల పోఖ్రియాల్ రాజీనామా చేయగా.. లాక్డౌన్ సమయంలో తలెత్తిన వలస కార్మికుల అంశాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయినందు వల్ల ఆ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్పై వేటు పడినట్లు చెబుతున్నారు.
కాగా- కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే వారి జాబితా కాస్త పెద్దదే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు, రిపబ్లిక్ టీవీ ఛైర్మన్ రాజీవ్ చంద్రశేఖర్కు కేబినెట్ బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రపతి భవన్లో 43 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.
Recommended Video
తెలంగాణకు చెందిన జీ కిషన్ రెడ్డికి పదోన్నతి కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. నారాయణ్ రాణె, భూపేందర్ యాదవ్, సునీత దుగ్గల్, మీనాక్షి లేఖి, జ్యోతిరాదిత్య సింధియా, అనుప్రియా పటేల్, అజయ్ భట్, శర్బానంద సొనొవాల్, పశుపతి పరాస్, ప్రీతీమ్ ముండే, శోభా కరంద్లాజె, ఆర్సీపీ సింగ్, పురుషోత్తం రుపాల, జీ కిషన్ రెడ్డి, వినోద్ సోంకర్, పంకజ్ చౌదరి, అశ్విని వైష్ణవ్, నిశిత్ ప్రామాణిక్లతో పాటు మరికొందరు ఈ సాయంత్ర ప్రమాణ స్వీకారం చేస్తారు.