దేశంలో హైవేల అభివృద్ధికి 7 లక్షల కోట్లు, ప్రతిష్ఠాత్మకంగా ‘భారత్ మాల’, మోడీ సర్కారు నిర్ణయం
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 83 వేల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల అభివృద్ధికి మంత్రివర్గం ఆమ
న్యూఢిల్లీ: దేశంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా జాతీయ రహదారుల అభివృద్ధికి ఏడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 83 వేల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ప్రతిష్ఠాత్మకంగా జాతీయ రహదారుల అభివృద్ధి...
రాష్ట్రాల సరిహద్దులను అనుసంధానం చేసే ‘భారత్మాల' హైవే అభివృద్ధి ప్రాజెక్టు కింద 28,400 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. భారత్మాలలో భాగంగా దేశవ్యాప్తంగా 44 ఆర్థిక కారిడార్లను నిర్మించనున్నారు. ఈ హైవేల అభివృద్ధి ప్రాజెక్టుతో వచ్చే ఐదేళ్లలో సరుకు రవాణా మరింత వేగంగా జరుగుతుందని, ఆర్థికాభివృద్ధికి ఊతం లభించగలదని ప్రభుత్వం భావిస్తోంది. రూ.6.9 లక్షల కోట్ల పెట్టుబడితో 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది.
రెండో అతిపెద్ద రహదారుల ప్రాజెక్టు...
ఇంతకుముందు 50 వేల కిలోమీటర్లను అభివృద్ధి చేసిన జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్హెచ్డీపీ) తరువాత రెండో అతిపెద్ద రహదారుల ప్రాజెక్టుగా ‘భారత్మాల'ను పేర్కొంటున్నారు. క్యాబినెట్ ఆమోదించిన జాతీయ రహదారుల ప్రాజెక్టులో ఎకనామిక్ కారిడార్ల అభివృద్ధి పథకాలు కూడా ఉన్నాయని ఓ అధికారి వివరించారు. దేశవ్యాప్తంగా 21వేల కిలోమీటర్ల పొడవున ఎకనామిక్ కారిడార్లను, వాటికి అనుసంధానంగా 14 వేల కిలోమీటర్ల పొడవున ఫీడర్ రూట్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇదివరకే ప్రణాళికను రూపొందించింది.
44 ఎకనామిక్ కారిడార్ల గుర్తింపు...
ఈ ఎకనామిక్ కారిడార్లలో హైదరాబాద్-పనాజీ, ముంబై కొచ్చిన్- కన్యాకుమారి, బెంగళూరు మంగళూరు, సంబల్పూర్ రాంచి కూడా ఉన్నాయి. ఈ కారిడార్లలో ట్రాఫిక్ వేగాన్ని పెంచేందుకు గుర్తింపునిచ్చిన రెండు గమ్యస్థానాల మధ్య నాలుగు లేన్ల రోడ్లను నిర్మిస్తారు. ప్రతిపాదిత భారత్మాల ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తున్న అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఏటీ కియార్నీ 44 ఆర్థిక కారిడార్లను గుర్తించింది. భారత్మాల మొదటిదశ ప్రాజెక్టుకు అనుమతినివ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ పెట్టుబడుల బోర్డు (పీఐబీ)ని కోరింది. ఇందుకు పీఐబీ వ్యయ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశం ఆమోదం తెలిపింది.
డీపీఆర్ ల తయారీలో తెలంగాణ ప్రభుత్వం...
భారత్మాల ప్రాజెక్టులో తెలంగాణకు మూడు ఆర్థిక కారిడార్లు మంజూరయ్యాయి. దాదాపు 356 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో ఈ కారిడార్లు నిర్మించనున్నారు. ఇందులో మొదటిది నార్కట్పల్లి నుంచి పొందుగుల వరకు, రెండో కారిడార్ హైదరాబాద్ నుంచి పనాజీ వరకు నిర్మించనున్నారు. మూడవ కారిడార్ను ఆర్మూర్- జగిత్యాల- రామగుండం మధ్య నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన డీపీఆర్ ల తయారీని తెలంగాణ ప్రభుత్వమే చేపట్టనుంది.