రైతుబంధు పై ఆశలు పెట్టుకున్న మోదీ..! 70వేల కోట్లతో పథకానికి రూపకల్పన..!!
న్యూఢిల్లీ,హైదరాబాద్ : కేంద్ర బీజేపి సర్కార్ వ్యవసాయ దారుల సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం గతంలో ఏ కేంద్రప్రభుత్వం చేయని లబ్దిని ఎంన్డీయే ప్రభుత్వం చేసి చూపించాలని భావిస్తున్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం అగ్రవర్ణ పేదలకోసం రిసర్వేషన్ తీసుకొచ్చిన మోదీ సర్కార్ ఇప్పుడు వ్యవసాయదారుల గురించి, వారు పండించే పంట గురించి సమాలోచనలు చేస్తోంది. 2016లో తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రైతు బంధు పధకాన్ని ప్రవేశపెట్టి ఊహించని ఫలితాలను రాబట్టిన విషయాన్ని గత కొద్ది రోజుటుగా కేంద్రం అ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది.
రైతులకోసం కొత్త పథకంపై కేంద్రం యోచన..! రైతు బంధుపైనే మొగ్గు..!!
అందుకోసం ఇటీవల పార్లమెంటరీ స్ఠాండింగ్ కమిటీ రైతు బంధు పధకం సాద్యాసాద్యాలపై ప్రతిపాదనలను సిద్దం చేయించిన అంశం కూడా తెలిసిందే. తాజా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుమారు 70వేల కోట్ల రూపాయలను రైతు సంక్షేమం కోసం మోదీ సర్కార్ వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులు పండించే పంటకు కేంద్రం ఇచ్చే మద్దత్తు ధరపై సబ్సిడి ఇవ్వాలని కూడా కేంద్రం గతంలో భావించింది. తాజాగా ఇదే రూపంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు పెద్ద యెత్తున మేలు జరిగేలా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
రైతుబంధు ద్వారా ఊహించని ఫలితాలు..! అమలు చేయాలని చూస్తున్న కేంద్రం..!!
దేశవ్యాప్తంగా సమస్యల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభు త్వం విజయవంతంగా అమలు చేస్తు న్న రైతుబంధు పథకం తరహాలో ఓ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అందిస్తున్న ఎరువుల రాయితీతో పాటు అన్ని వ్యవసాయ సబ్సిడీలకు బదులుగా రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమచేసి వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మోదీ సర్కారు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏటా 70వేల కోట్ల భారం..! ఐనా ఫరవాలేదు అంటున్న మోదీ సర్కార్..!!
ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి 70 వేల కోట్ల అదనపు భారం పడనున్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన నేపథ్యంలో వస్తు, సేవలపై పలు పన్ను మినహాయింపులు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే వార్షిక బడ్జెట్ లోటును అధిగమించింది. అయినప్పటికీ రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా రైతులను ప్రసన్నం చేసుకోవడానికి భారీ నిధులతో కొత్త పథకాన్ని తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
సాద్యాసాద్యాల పరిశీలన పూర్తి..! పథకం ప్రవేశ పెట్టడమే తరువాయి..!!
పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతోపాటు పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో రుణ మాఫీ కోసం దేశవ్యాప్తంగా రైతన్నలు నిరసనల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ర్టాల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో రైతులకు రుణమాఫీ చేయడం ద్వారా కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్న రైతన్నల అభిమానం చూరగొనేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.