మాట ఇచ్చి నిలబెట్టుకున్న మోడీ: కొత్తగా ఆ మంత్రిత్వ శాఖ ఏర్పాటు..ఎలా ఉండబోతోంది..?
"మే 23 తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొత్త ప్రభుత్వంలో జలశక్తి పేరుతో ప్రత్యేక మంత్రిత్వ శాఖను తీసుకొస్తాం. ఈ శాఖ అనేక రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరిస్తుంది" అని ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడులో ఏప్రిల్ 13న మాట ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఇచ్చిన మాట ప్రకారమే నీటి సమస్యల కోసం జలశక్తి పేరుతో ప్రత్యేక శాఖను క్రియేట్ చేశారు.
గజేంద్రసింగ్ షెకావత్కు జలశక్తి బాధ్యతలు
జలశక్తి మంత్రిత్వ శాఖ బాధ్యతలను గజేంద్ర సింగ్ షెకావత్కు అప్పగించారు. అంతకుముందు గజేంద్ర సింగ్ షెకావత్ మోడీ కేబినెట్లో సహాయమంత్రిగా పనిచేసి ఈసారి కేంద్ర మంత్రిగా ప్రమోషన్ పొందారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ పై గెలుపొందిన కారణంగా ఆయన్ను షెకావత్ను మంత్రి పదవిని వరించింది. ఇక్కడ మరో విషయం చోటు చేసుకుంది. తన కొడుకును గెలిపించాలన్న ఉద్దేశంతో అశోక్ గెహ్లాట్ రాష్ట్రంలోని ఇతర లోక్సభ స్థానాలపై దృష్టి సారించలేకపోయారని రాహుల్ మందలించినట్లు తెలుస్తోంది. గెహ్లాట్ 90శాతం సమయాన్ని ఒక్క జోద్పూర్ స్థానానికే కేటాయించారు. అయినప్పటికీ అక్కడ విజయం సాధించలేకపోయారు.
తాగు సాగు నీటి కోసమే శాఖ ఏర్పాటు
రాజస్థాన్లో 24 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గత ప్రభుత్వంలో షెకావత్ వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు మోడీకి సన్నిహితుల్లో షెకావత్ ఒకరుగా ఉన్నారు. సాగు మరియు తాగు నీరు సమస్యలను పరిష్కరించేందుకుగాను మోడీ తన సన్నిహితుడైన గజేంద్రసింగ్ షెకావత్కు ఈ మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇక పరిశుభ్రమైన తాగునీరు అందించడంతో పాటు రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని భావించారు.
హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందిలా
గత మోడీ ప్రభుత్వంలో రైతు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కూడా పదేపదే వ్యవసాయ అంశాలపై విమర్శలు గుప్పించింది. ఇదే అంశం హిందీ ప్రధాన రాష్ట్రాలైన రాజస్థాన్. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయాన్ని అందించాయి. ఈ ఏడాదిలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో నీటి సమస్య ప్రధాన సమస్యగా ఉండబోతోంది. వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులు ఈ దేశంలో దాదాపు 55శాతం మంది ఉన్నారు. ఇక హర్యానా మహారాష్ట్ర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. బీహార్, ఢిల్లీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాయి. బీహార్ కరవు సమస్యలతో పాటు వరద సమస్యలను కూడా ఎదుర్కొంది. ఇక ఢిల్లీలో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య తిష్టవేసి ఉంది. ప్రధాని పెట్టుకున్న ఆశలను గజేంద్ర సింగ్ షెకావత్ ఏమేరకు నెరవేరుస్తారో చూడాలి.