'మామ్' ఫోటో ఈసీఐఎల్ యాంటీనా ద్వారా, కందకాలు..
హైదరాబాద్: భారత్ బుధవారం విజయవంతంగా అంగాకరకుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం గురువారం నాడు అంగారకుడి పైన తొలి చిత్రాలను పంపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలు హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటీనా ద్వారానే వచ్చాయి.
మామ్ పంపిన చిత్రాలు ఈసీఐఎల్ తయారు చేసిన యాంటీనా ద్వారానే వచ్చాయి. ఈ యాంటీనా బెంగళూరు సమీపంలో ఉంది. దీనిని ఈసీఐఎల్ 2008లో తయారు చేసింది. ఈ యాంటీనా 32 మీటర్ల వ్యాసం, బరువు 300 టన్నులుతో ఉంది. ఇదే యాంటీనా చంద్రయాన్ మిషన్ లాంచింగ్ ఆపరేషన్లోను కీలక పాత్ర పోషించింది.
దీనిపై ఈసీఐఎల్ అధికారులు గురువారం మాట్లాడారు. మామ్ తయారీలో తమకూ పాత్ర ఉందని ప్రకటించింది. మార్స్ మిషన్కు సంబంధించి ట్రాకింగ్, టెలిమెట్రీ, కమాండ్ అప్లికేషన్స్కు అవసరమైన అత్యాధునిక ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ (ఐడీఎస్ఎన్) యాంటీనాను తామే సరఫరా చేశామని ఈసీఐఎల్ తెలిపింది.
రూ.65 కోట్ల అంచనాతో 300 టన్నుల బరువు ఉన్న ఈ యాంటెనాను పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు వెల్లడించింది. బాబా అటామిక్ రీసెర్చ్, ఇస్రో శాటిలైట్ సెంటర్ సహకారంతో ఈ యాంటెనా తయారు చేశారు. మామ్ యాంటినా తయారీకీ సంబంధించి తొలి నుండి భాగస్వామిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మంగళయాన్ మార్చ్ మిషన్ కార్యక్రమం ప్రారంభం నుండి ఈసీఐఎల్ ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచిందని చెప్పారు. ఈ యాంటినా ద్వారానే మామ్ పంపిన చిత్రాలు స్పష్టంగా వచ్చినట్లు తెలిపారు. దీని పర్యవేక్షణ కోసం 11 నెలలుగా తమ నిపుణులను ఇస్రో కేంద్రంలో ఉంచినట్లు తెలిపారు.
కాగా, ఇస్రో విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం గురువారం అంగారకుడిపై తొలి చిత్రాలను పంపిన విషయం తెలిసిందే. మార్స్ ఆర్బిటర్ ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రాలను పోస్టు చేశారు. అంగారక గ్రహ ఉపరితలం ఫొటోలు తీసి కంట్రోల్ సెంటర్కు పంపింది. ఈ ఫొటోనే ఇస్రో వర్గాలు మామ్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టాయి.
‘మార్స్ ఇమేజ్ 7300 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసింది. 376ఎం ప్రాదేశియ రిజల్యూషన్తో ఉంది' అని ఎంటి ఎట్ ద రేట్ ఆఫ్ మార్స్ ఆర్బిటర్లో పోస్టు చేశారు. దానిపై ‘ద వ్యూ ఈజ్ నైస్ అప్ హియర్' ఇక్కడ నుంచి చూస్తే మామ్ మార్స్ ఎంతో బావుంది అన్న క్యాప్షన్ కూడా ఉంది.
మరోవైపు, అంగారక గ్రహ ఉపరితల, వాతావరణ అధ్యయనాన్ని మంగళయాన్ మొదలు పెట్టింది. గ్రహ కక్ష్యలోకి ప్రవేశించి 24 గంటలు తిరక్కుండానే అరుదైన చాయాచిత్రాల్ని అందించింది. నారింజ రంగులో మెరిసిపోతున్న అంగారక గ్రహ ఉపరితలంపై నల్లని పెద్దపెద్ద గోతులు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. పరిభ్రమణ గతిలో గ్రహ ఉపరితలానికి 7300కిలోమీటర్ల దూరంలో ఉండగా మంగళయాన్ కెమెరాలు క్లిక్మన్నట్టుగా చెబుతున్నారు.