రైతుకు అవమానం: కూతురు, కోడలును పంపమన్న వడ్డీ వ్యాపారి!
ముంబై: ఆరుగాలం కష్టపడి దేశానికి ఆహారాన్ని అందిస్తున్న ఓ రైతుకు ఘోర అవమానం జరిగింది. అప్పు కోసం తన భూమిని తాకట్టు పెట్టిన రైతును ఓ వడ్డీ వ్యాపారి తీవ్రంగా కించపర్చాడు. తాకట్టు పెట్టిన భూమిని తిరిగి ఇవ్వాలంటే 'నీ కూతురు, కోడలును నా కంపెనీకి పంపించు' అంటూ ఓ రైతు ముందు తన దుర్మార్గపు డిమాండ్లను ఉంచాడు.
ఈ నేపథ్యంలో సదరు రైతు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
సదరు వడ్డీ వ్యాపారిపై తగిన చర్యలు తీసుకుంటామని బీడ్ ఎస్పీ అనిల్ పరాస్కర్ తెలిపారు. రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ ఈ విషయంపై తనతో మాట్లాడారని, నివేదిక ఇవ్వాలని కోరారని చెప్పారు.
'తనకు సంబంధించిన తాకట్టు భూమిని వడ్డీ వ్యాపారి స్వాధీనం చేసుకున్నాడని ఆ రైతు పోలీసులకు గత ఏప్రిల్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత తన భూమి తనకు దక్కాలంటే తన కూతురు, కోడలును 'కంపెనీ' కోసం పంపంచమని ఆ వడ్డీ వ్యాపారి డిమాండ్ చేస్తున్నాడని ధరూర్కు చెందిన ఈ రైతు గత ఆదివారం మరోసారి ఫిర్యాదు చేశాడు' అని ఆయన తెలిపారు.
'మాకు అందిన తాజా సమాచారం ప్రకారం సదరు రైతు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. అయినా, తాము ప్రాథమిక విచారణ చేపట్టాం. నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటాం' అని ఎస్పీ తెలిపారు.