చల్లని కబురు : రుతుపవనాలకు తొలగిన అడ్డంకి.. నాలుగైదు రోజుల్లో దక్షిణాదిన విస్తారంగా వర్షాలు..
Recommended Video
ఢిల్లీ : భారీ వర్షాలు కురుస్తాయని ఆశపెట్టుకున్న జనానికి నైరుతి రుతుపనాలు ఇప్పటికి నిరాశ మిగిల్చాయి. అయితే రానున్న నాలుగైదు రోజుల్లో పరిస్థితి మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో రుతుపవనాలు చురుగ్గా కదిలి దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ పాటికే రుతుపవనాలు దక్షిణాదిలో విస్తరించి విస్తృతంగా వానలు కురవాల్సి ఉన్నా అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఆలస్యమైంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం
రుతుపవనాలు ప్రస్తుతం కర్నాటకకు చేరుకున్నారు. వాటి ప్రభావంతో మంగళూరు, మైసూరు, కుడళూరు, గోల్పారా, గ్యాంగ్టక్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం బంగాళాఖాతంలో నాలుగైదు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుంది. అది రుతుపవనాలకు విస్తరణకు తోడ్పడనుంది.

4-5 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు
నైరుతి రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలించడంతో మధ్య అరేబియా సముద్రం, కర్నాటక, కొంకణ్ గోవాల్లోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, సిక్కిం, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో 4 నుంచి 5 రోజుల్లో వర్షాలు ప్రారంభమవుతాయని ఐఎండీ ప్రకటించింది.

మరికొన్ని గంటల్లో రాయలసీమలో వర్షాలు
గరిష్ట ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న రాయలసీమ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరికొన్ని గంటల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. ఆ తర్వాత అవి వేగంగా విస్తరిస్తాయని అంచనా వేస్తోంది. ప్రస్తుతం గాలిలో తేమ తక్కువగా ఉన్నందున రుతుపవనాలు కాస్త బలహీనమయ్యాయని, ఆ కారణంగానే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రుతుపవనాలు ప్రవేశించిన మరుసటి రోజు తెలంగాణలోకి ఎంటరవుతాయని ఐఎండీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications