వాతావరణం అప్డేట్స్: ఏపీ-తెలంగాణలలో వర్షాలు, ముంబై-థానేలో హెచ్చరికలు జారీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, గోవాలలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైలో జూన్ 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ధారాపాతంగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
ఈశాన్య రుతుపవనాలు కర్ణాటక, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తరించాయి. దక్షిణ కొంకణ్లోని కొన్ని ప్రాంతాలలో, గోవా, తెలంగాణ, కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలలో రానున్న 48 గంటల్లో మరింత విస్తరించనున్నాయి. బుధవారం (జూన్ 6) ఉదయం వాతావరణ శాఖ ప్రకారం పైవిదంగా ఉంది.
మహారాష్ట్ర, గుజరాత్లలోని కొన్ని ప్రాంతాలకు, దక్షిణ మధ్య ప్రదేశ్లోన్ని ప్రాంతాలకు, చత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. జూన్ 9వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య విస్తరించనున్నాయి.
మహారాష్ట్ర, తెలంగాణలోని పలు ప్రాంతాలకు కూడా రుతుపవనాలు రానున్న 48 గంటల్లో మరింత విస్తరించనున్నాయి. ముంబైలో జూన్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారీ వర్ష సూచన ఉంది. ముంబైలోని ప్రాంతీయ వాతావరణ శాఖ ముంబై, థానేలలో హెచ్చరికలు జారీ చేసింది.
ఈసారి రుతుపవనాల తీవ్రత ఎక్కువగా ఉందని, కాబట్టి కేరళ, కోస్టల్ కర్ణాటక, కొంకన్ బెల్ట్, గోవా తదితర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా వస్తాయని తెలిపింది. వరదలకు కూడా అవకాశముందని పేర్కొంది.
రానున్న 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు. దక్షిణ జిల్లాల్లో తక్కువ నుంచి మోస్తారు వర్షపాతాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వాతావరణ శాఖ ప్రకారం.. ఈసారి సెంట్రల్ ఇండియాలో సాధారణ వర్షపాతం ఉంటుంది. దక్షిణాదిన.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లోసాధారణం కంటే తక్కువ వర్షం నమోదయ్యే అవకాశముంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దేశవ్యాప్తంగా వర్షపాతం 101 శాతం ఉటుందని తెలిపింది.