Union Budget 2020: మరిన్ని తేజస్ రైళ్లు: వంద విమానాశ్రయాలు: రవాణాకు 1.74 లక్షల కోట్లు..!
న్యూఢిల్లీ: దేశంలో రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి 1.74 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ మొత్తంతో రవాణా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, కొత్తగా ఎక్స్ప్రెస్ వేలను నిర్మిస్తామని అన్నారు. రైల్వే వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయడాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
Recommended Video

వంద విమానాశ్రయాలు..
దేశవ్యాప్తంగా కొత్తగా వంద విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు, ప్రణాళికలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇప్పటికే- ప్రతి రాష్ట్రంలోనూ మూడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు. 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపారు.

మరిన్ని తేజస్ రైళ్లు..
రైల్వే వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలను భాగస్వామ్యులను చేయడానికి ఉద్దేశించిన తేజస్ రైళ్ల సంఖ్యను పెంచాలని కూడా నిర్ణయించామని, 2020-2021 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తేజస్ రైళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని అన్నారు. దేశంలోని అన్ని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ నగరాల మధ్య తేజస్ రైళ్లను నడిపిస్తామని చెప్పారు. దీనితోపాటు నిరుపయోగంగా ఉన్న రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఖాళీ స్థలాలు, పట్టాల వెంట సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతామని అన్నారు.

ఆధునిక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు..
రవాణా రంగ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా.. దేశవ్యాప్తంగా ఇప్పుడున్న రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, లాజిస్టిక్ సెంటర్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగానే.. ఢిల్లీ-ముంబై, చెన్నై-బెంగళూరు ఎక్స్ప్రెస్ వే లను పూర్తి చేస్తామని అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని 2023 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. అదే క్రమంలో.. చెన్నై-బెంగళూరు ఎక్స్ప్రెస్ వే మార్గం నిర్మాణాన్ని ఇంకా చేపట్టాల్సి ఉందని తెలిపారు.

ఆరు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల పర్యవేక్షణ
దేశంలో 6000 కిలోమీటర్ల జాతీయ రహదారులను అనుక్షణం పర్యవేక్షించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. దీనికి అదనంగా మరో 24,000 కిలోమీటర్ల రైళ్ల మార్గాన్ని విద్యుదీకరిస్తామని చెప్పారు. 9,000 కిలోమీటర్ల మేర ఆర్థిక కారిడార్లను నిర్మిస్తామని అన్నారు. అలాగే-14,500 రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన పలు రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉందని చెప్పారు. దీన్ని విస్తరిస్తామని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రవాణా రంగం కోసం 1.73 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications