Kerala: కేరళను వణికిస్తున్న జ్వరాలు.. రోజుకు 10 వేలకు పైగా నమోదు..
కేరళ ప్రజలను గత కొద్ది రోజులుగా జ్వరం వణికిస్తోంది. ఇక్కడ రోజువారి జ్వరం కేసులు 10 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. మంగళవారం జూన్ 20న కేరళలో 13 వేలకు పైగా జ్వరం కేసులు నమోదయ్యాయి. మేలో ఈ సంఖ్య 6 వేలకు పైగా ఉంది. భారీగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఒక నెలలోనే రోజువారీ కేసులు డబల్ కావడంపై అక్కడి అధికారులతో పాటు ప్రజలు కలవరపడుతున్నారు.
కేరళలో ఇప్పటివరకు 1,87,480 జ్వరం కేసులు నమోదయ్యాయి. భారీగా జ్వర బాధితులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం పినరయి విజయన్ బుధవారం జ్వరాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా క్లీనింగ్ డ్రైవ్ కు పిలుపునిచ్చారు. డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్ పై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

కేరళ ఆరోగ్య శాఖ ప్రకారం ఆ రాష్ట్రంలో 43 డెంగ్యూ, 15 లెప్టోస్పిరోసిస్ కేసులు కాకుండా 13 వేల 387 జ్వర కేసులు నమోదయ్యాయి. డెంగ్యూకు కారణమయ్యే దోమలను నాశనం చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. ప్రజలు కూడా క్లీనింగ్ డ్రైవ్కు చేపట్టాలని కోరారు. ఇంటితో పాటు గ్రామా పరిసరాలను శుభ్రపరచడం, వ్యర్థాల తొలగింపు సమర్థవంతంగా చేపట్టాలన్నారు.
తోటల రంగం, నిర్మాణ స్థలాలు, స్క్రాప్ డంపింగ్ యార్డులు, వలస కార్మికుల నివాసాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. వైరల్ ఫీవర్ రాష్ట్రానికి ముప్పుగా మారకుండా చూసేందుకు ప్రజలు అవగాహనతో ముందుకు వెళ్లాలని కోరారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రాష్ట్ర ఆరోగ్య శాఖకు జ్వరం డేటాను అందించకపోవడంతో జ్వరపీడితుల వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications