శశికళ, దినకరన్ కు మద్దతు, 100 మంది మీద వేటు వేసిన ఓపీఎస్; ఈపీఎస్, దెబ్బ !
Recommended Video

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న నాయకుల మీద వేటు వెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయం తీసుకున్నారు.

పదవులు ఎవరికి ?
అన్నాడీఎంకేలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న నాయకులు ఎవరైనా సరే చూస్తూ ఊరుకోకూడదని సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అంటున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ నాయకుల మీద నిఘా వేశారు.

ఎక్కడెక్కడ ఉన్నారు ?
అన్నాడీఎంకే పార్టీలో ఉంటూనే శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారు ? అని ఇప్పటికే సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరా తీశారు.

వేటు పడింది !
శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన 9 మందిని మొదటి విడతలో. 44 మందిని రెండవ విడతలో గురువారం బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పరిస్థితి ఇలాగే ఉంటుందని పళనిస్వామి, పన్నీర్ సెల్వం హెచ్చరించారు.

ముచ్చటగా మూడో సారి
అన్నాడీఎంకే పార్టీలో ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా విషయాలు తెలుసుకుని టీటీవీ దినకరన్ కు సమాచారం ఇస్తున్న 100 మంది నాయకులను పళనిస్వామి, పన్నీర్ సెల్వం గుర్తించారు. టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్న ఆ 100 మంది నాయకుల మీద శుక్రవారం వేటు పడింది.

హడలిపోతున్న నేతలు
అన్నాడీఎంకే పార్టీ నేతల మీద వరుసగా వేటు పడటంతో ఆ పార్టీ నేతలు హడలిపోతున్నారు. ఎప్పుడు తమ మీద వేటు పడుతుందో, ఎక్కడ రాజకీయ నిరుద్యోగులు అయిపోతామో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేలు అయినా సరే టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తే కచ్చితంగా వేటు వెయ్యాలని సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications