‘‘ఉదయం నవ్వుతూ మాట్లాడాడు... రాత్రయ్యేసరికి ఇలా..’’
జమ్మూ కశ్మీర్లో శనివారం రాత్రి జరిగిన తీవ్ర వాదుల దాడిలో అమరుడైన తమిళ సైనికుడు మణివణ్ణన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చెన్నై: జమ్మూ కశ్మీర్లో శనివారం రాత్రి జరిగిన తీవ్ర వాదుల దాడిలో అమరుడైన తమిళ సైనికుడు మణివణ్ణన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ రోజు ఉదయమే తమతో ఫోన్లో నవ్వుతూ మాట్లాడిన బిడ్డ రాత్రయ్యే సరికి విగతజీవుడవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కశ్మీర్లో శనివారం రాత్రి జరిగిన దాడిలో అసువులు బాసిన సైనికుల్లో మణివణ్ణన్ కూడా ఉన్నారు. తిరువణ్ణా మలై జిల్లా ఆరణి సమీపంలోని పోలూరు తాలూకా తేప్పనందల్ గ్రామానికి చెందిన గోపాల్, చిన్నపొన్ను దంపతుల కుమారుడు మణి వన్నన్ (24).
సంబంధాలు కూడా చూస్తున్నాం.. ఇంతలోనే..
నాలుగు సంవత్సరాలుగా కశ్మీర్లో సైనికదళంలో ఈయన పనిచేస్తున్నారు. మణి వన్నన్ కు వివాహం చేసేందుకు నిర్ణయించి, ఆయన తల్లిదండ్రులు సంబంధాలు కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడు తీవ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్త తెలియగానే వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఉదయం నవ్వుతూ మాట్లాడిన బిడ్డ...
ఆదివారం ఈ విషయం తెలియగానే తేప్పనందల్ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పలువురు మణివన్నన్ కుటుంబ సభ్యులను పరామర్శించి వెళుతున్నారు. 'శనివారం ఉదయం 11 గంటలకు మేము మణివణ్ణన్తో సెల్ఫోన్లో మాట్లాడాం. అమ్మా.. నాన్న ఎలా ఉన్నారు? చెల్లెలు ఎలా ఉందంటూ మాట్లాడాడు. రాత్రి అయ్యేసరికి తీవ్ర వాదుల దాడిలో మణివణ్ణన్ మరణించినట్టు సైనికాధికారులు సమాచారం అందించారు. మాకేం అర్థం కాలేదు. ఉదయం నవ్వుతూ మాట్లాడిన మా బిడ్డ రాత్రికి...' అంటూ భోరున విలపించింది మణివణ్ణన్ మాతృమూర్తి.
మా అన్న గురించి గర్వపడుతున్నాం.. కానీ..
అతని సోదరి మాట్లాడుతూ... అన్న దేశం కోసం ప్రాణత్యాగం చేసినందుకు గర్వపడుతున్నామని, అయితే తమ కుటుంబానికి ఇది తీరని లోటని కన్నీళ్లు పెట్టుకుంది. కశ్మీర్ దాడిలో అసువులు బాసిన వీర సైనికులకు ఆదివారం ఉదయం ఢిల్లీలో ఆర్మీ దళపతి విబిన్ రామన్ సహా సైనికాధికారులు నివాళులర్పించారు. సోమవారం వారి భౌతికకాయాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మణివణ్ణన్ భౌతికకాయం సోమవారం తేప్పనందల్ గ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం సంతాపం... రూ.20 లక్షల ఆర్థిక సాయం
కశ్మీర్ తీవ్రవాదుల దాడిలో అమరుడైన సైనికుడు మణివణ్ణన్ కుటుంబానికి ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి రూ.20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జవాన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆదివారం ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు. అందులో.. 'జమ్మూ కశ్మీర్ రాష్ట్రం గుల్గామ్ ప్రాంతంలో తీవ్రవాదులు జరిపిన దాడిలో భారత సైనికులు పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారిలో తమిళ జవాన్ మణివణ్ణన్ ఉన్నారని తెలిసి మరింత దిగ్భ్రాంతికి గురయ్యాను. అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. వారికి తమిళనాడు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది..' అని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు.