5వేల కోసం కొడుకుని తాకట్టు పెట్టిన తండ్రి, విడుదల కోసం ఎదురుచూపు
హర్దా: కన్న తండ్రే కుమారుడిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. రూ. 5000, 600 కేజీల గోధమ పిండి కోసం కుమారుడినే తాకట్టు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్లోని హర్దా గ్రామంలో చోటుచేసుకుంది.
హర్దాకు చెందిన భగీరథ్(55) తన కుమారుడు సంత్రమ్ (14)ని 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్ధానిక వ్యాపారి కన్హయ్యా లాల్ భండారి దగ్గర రూ. 5000, 600 కేజీల గోధుమ పిండి కోసం తాకట్టు పెట్టాడు.
సంత్రమ్కి 14 సంవత్సరాలు వచ్చినా తన కుటుంబం తీసుకున్న అప్పుని తీర్చడానికి రోజూ 12 గంటలు శ్రమించాల్సి వస్తుంది. ఇందుకు గాను వ్యాపారి సంవత్సరానికి 100 కేజీల గోధుమ పిండిని సంత్రమ్ కుటుంబానికి ఇస్తున్నాడు.
తనని ఎప్పుడు వదిలిపెడతారని వ్యాపారని అడిగితే, తన కుటుంబం తీసుకున్న అప్పు చాలా ఉందంటూ యజమాని వదిలిపెట్టడం లేదని అంటున్నాడు. తను చనిపోయేంత వరకు పని చేస్తూనే ఉండాలని యజమాని చెప్తున్నాడంటూ సంత్రమ్ మీడియా ముందు వాపోయాడు.
దీంతో యజమాని కన్హయ్య ఇంటికి చేరుకున్న మీడియా ఈ విషయమై ప్రశ్నించగా తీసుకున్న సంత్రమ్ తండ్రి తీసుకున్న అప్పు తీర్చకుండానే ఒక సంవత్సరం పనిచేసి వెళ్లిపోయాడని, ఈ విషయం వాళ్ల తండ్రి ద్వారానే చెప్పిస్తానని యజమాని పేర్కొన్నారు.
హర్దా గ్రామంలో ఉన్న కోర్కు, గోండ్ గిరిజన తెగకు చెందిన ఎంతో మంది చిన్నారులు కుటుంబ పోషణ కోసం బందీ కార్మికులుగా పని చేస్తున్నారని గ్రామ అధికారి తెలిపారు. అదే గ్రామంలో మరో యజమాని వద్ద పని చేస్తున్న కమల్ అనే బాధితుడు మీడియాతో మాట్లాడుతూ నా తండ్రి నన్ను తాకట్టు పెట్టి, అప్పుగా తీసుకున్న డబ్బుతో ఆల్కహాల్ కొనుగోలు చేసేవాడని వాపోయాడు.