సౌత్ ఇండియాలో ఈ ఏడాది జరిగిన అత్యంత విషాదాలు ఇవే..?

2025వ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. కానీ ఈ ఏడాది మిగిల్చిన విషాదాన్ని మాత్రం ఎవరూ మర్చిపోలేరు అంటే అతిశయోక్తి కాదు. రోడ్డు ప్రమాదాల్లో ఒకరిద్దరు చనిపోవడం జరుగుతుంటుంది. కానీ ప్రమాదాలలో పదుల సంఖ్యలో మనుషులు చనిపోవడం.. అనూహ్య ఘటనల్లో తీరని విషాదాలు జరగడం ఈ ఏడాది లోనే అని చెప్పాలి. ఎప్పుడూ గుర్తుండే పీడకలలను మిగిల్చిన.. ఈ 2025లో ప్రమాదాలే కాకుండా అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.

ఈ విషాద ఘటనల వల్ల కుటుంబాలు మానసికంగా తీవ్రంగా కుంగిపోతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోతారు, భవిష్యత్తు మీద భయం పెరుగుతుంది. కొందరిలో డిప్రెషన్, ఒంటరితనం, నిద్రలేమి లాంటి సమస్యలు మొదలవుతాయి. ఇక ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. తల్లిదండ్రులు పిల్లలను కోల్పోతే ఆ వేదనకు మాటలు ఉండవు. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతే, ఆ చిన్న వయసులోనే బాధ్యతల భారాన్ని మోసుకోవాల్సి వస్తుంది. ఒక భార్య భర్తను కోల్పోతే.. ఆమె జీవితమే ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారుతుంది.

most-tragic-events-that-happened-in-south-india-this-year-2025

ఈ ఏడాదిలో అత్యంత విషాద ఘటనలు ఇవే..?

తిరుపతి తొక్కిసలాట..

జనవరి 8.. తిరుపతిలోని 8 కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం 90 కౌంటర్ల ద్వారా లక్షా ఇరవై వేల టోకెన్లు జారీ చేశారు. అయితే భక్తుల రద్దీ పెరిగిన తరుణంలో దీంతో భక్తులు, పోలీసులు.. టీటీడీ అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తడంతో తొక్కిసలాట జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో బైరాగి పట్టెడ వద్ద టోకెన్ల కోసం ఈ దుర్ఘటన చోటు చేసుకొని.. ఆరుగురు భక్తులు మృతి చెందగా 29 మందికి గాయాలయ్యాయి.

SLBC టన్నెల్‌లో ప్రమాదం..

SLBC ప్రాజెక్టులో భాగంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 14 కిలోమీటర్‌ వద్ద ఫిబ్రవరి 22న రాత్రి 8:30 గంటల సమయంలో కార్మికులు పనులు చేస్తుండగా, అకస్మాత్తుగా పైకప్పు కూలిపడటంతో కాంక్రీట్‌ పెచ్చులు ఊడి పడి 8 మంది ఉద్యోగులు, సిబ్బంది చనిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

విశాఖ చందనోత్సవం..

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఏప్రిల్‌ 29న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతిచెందగా, ఒకరు గాయపడ్డారు.

గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదం..

హైదరాబాదులోని గుల్జార్ హౌస్‌లో మే 18న తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఇన్వర్టర్‌లో షార్ట్ సర్క్యూట్ అని అధికారులు గుర్తించారు. మంటలు త్వరగా వ్యాపించడంతో పెద్ద ఎత్తుల ప్రాణనష్టం సంభవించింది.

చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట

జూన్‌ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఈ సంఘటనకు కారణం అంచనాలకు మించి జనం రావడం అని, దీనికి అవసరమైన అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించడం అని ప్రభుత్వ విచారణలో తేలింది.

పాశమైలారం పేలుడు..

సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరులోని పాశమైలారంలో జూన్‌ 30న సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రయింగ్ యూనిట్‌లో రియాక్టర్‌ పేలుడు సంభవించగా ఘటనలో 46 మంది కార్మికులు మరణించారు.

మామిడికాయ లారీ బోల్తా..

జూలై 14న రాజంపేట నుంచి రైల్వే కోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై అదుపుతప్పి బోల్తా పడటంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

కరూర్‌ తొక్కిసలాట..

2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట సంభవించింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. హైకోర్టు ఆదేశాలతో ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టింది.

వేమూరి ట్రావెల్స్‌ బస్సు..

అక్టోబర్ 24న కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్ని జ్వాలలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా.. 22మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

శ్రీకాకుళం తొక్కిసలాట..

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా నవంబర్‌ 1న స్వామి వారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తుల రద్దీ చోటుచేసుకుంది. దీంతో తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందారు.

చేవెళ్ళ బస్సు - లారీ ఢీ..

నవంబర్‌ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సుపై కంకర లారీ బోల్కా పడటంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+