సుష్మాపై కాంగ్రెస్ పోల్: షాకిచ్చిన నెటిజన్లు, ఏకేయడంతో పోల్ డిలీట్
న్యూఢిల్లీ: తాము ఆపదలో ఉన్నామని ఇతర దేశాల్లోని భారతీయులు సోషల్ మీడియాలో తమ విన్నపాన్ని తెలిపిన క్షణాల్లోనే వారికి సాయమందించడంలో ఎప్పుడూ ముందుండే విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు నెటిజన్లు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ తాజాగా పెట్టిన ఓ పోల్లో సుష్మాకు మద్దతు పలుకుతూ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు.
ఇటీవల ఇరాక్లోని మోసుల్కు వెళ్లిన 39 మంది భారతీయుల అక్కడే ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. వాళ్లు చనిపోయిన విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి దాచి పెట్టారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అంతేగాక, 39 మంది భారతీయుల కేసును పరిష్కరించడంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలమయ్యారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
కాంగ్రెస్ ట్విట్టర్ పోల్
ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ సోమవారం ట్విట్టర్ వేదికగా పోలింగ్ పెట్టింది. ‘39 మంది భారతీయులను వెనక్కి తీసుకురాలేకపోవడంలో విదేశాంగశాఖ మంత్రి విఫలమయ్యారని మీరు భావిస్తున్నారా'? అని ప్రశ్న వేస్తూ పోలింగ్ పెట్టింది. కాంగ్రెస్ ఆ ట్వీట్ పెట్టిన కొద్ది సేపటికే వైరల్గా మారింది.
కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన నెటిజన్లు
కానీ, కాంగ్రెస్ ఆ తర్వాత ఆ ట్వీట్ను తొలగించింది. అప్పటికే పలువురు నెటిజన్లు ఆ ట్వీట్ను రీట్వీట్ కూా చేశారు. 24 శాతం ఆమె విఫలమయ్యారని భావిస్తున్నట్లు తెలిపితే.. 76శాతం మంది మాత్రం సుష్మా విఫలం కాలేదంటూ ఆమెకు అనుకూలంగా ఓటు వేశారు.
సుష్మాకు నెటిజన్ల ప్రశంసలు
కాగా, ఆ ట్వీట్ను సుష్మా స్వరాజ్ కూడా రీట్వీట్ చేశారు. కాంగ్రెస్ తన సొంత స్వార్థం కోసం ఇలా చేస్తోందని పలువురు నెటిజన్లు దుయ్యబట్టారు. ‘ఎవరెన్ని చెప్పినా సుష్మా భారతీయుల చిన్నమ్మే' అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.
కాంగ్రెస్ను ఏకిపారేశారు
‘కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో ఎన్నో తప్పులు, కుంభకోణాలు చేసింది. మరి అలాంటప్పుడు సుష్మాజీ చేసిన దాన్ని తప్పుగా ఎలా భావిస్తారు? మేడమ్ ఎప్పటికీ భారతీయుల చిన్నమ్మే', ‘కాంగ్రెస్ ఆ ట్వీట్ను డిలీట్ చేయడంలో ఆశ్చర్యమే లేదు', ‘మీరు నిజాయతీగా పనిచేసినప్పుడే ఇటువంటివి జరుగుతాయి' అని నెటిజన్లు కాంగ్రెస్ను తీరుని తప్పుబడుతూ ట్వీట్లు పెట్టారు. సుష్మాను తప్పుపట్టడం కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.