మధ్యప్రదేశ్ పోల్స్: బిజెపి నేత నోట్లు వెదజల్లారు
భోపాల్: డబ్బుల విషయంలో బిజెపి నేత వివాదంలో చిక్కుకున్నారు. జబల్పూర్ బిజెపి నేత ఆంచల్ సోంకర్ ఓ మత కార్యక్రమంలో ప్రజల ముందు డబ్బులు వెదజల్లుతూ వీడియో టేప్లకు చిక్కారు. ఈ విషయాన్ని టీవి చానెళ్లు బయటపెట్టాయి. వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్ పరిశ్రమల మంత్రి కైలాష్ విజయ్ వర్గియా నగదు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు.
అంచల్ సోంకర్ డబ్బులు వెదజల్లిన సంగఠన శనివారం జరిగింది. ఈద్ సందర్బంగా మాజీ మంత్రి అంచల్ సోంకర్ డబ్బులు వెదజల్లినట్లు టీవీ చానెల్ వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి. ప్రజలకు డబ్బుల పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎన్నికల కమిషన్ బిజెపి నేతకు నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఈసి ఆదేశించింది.
అయితే, తన చర్యను అంచల్ సోంకర్ ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ సమర్థించుకున్నారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఇటువంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. మధ్యప్రదేశ్తో పాటు నాలుగు రాష్ట్రాలకు అక్టోబర్ 4వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఈసి మంత్రి కైలాష్ విజయ్ వర్గియాకు కూడా నోటీసు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయానికి తాను కట్టుబడి పనిచేస్తానని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లో నవంబర్ 25వ తేదీన పోలింగ్ జరగనుంది.