ముకేష్ అంబానీ, ఫ్యామిలీకి 8 సార్లు బెదిరింపు కాల్స్: కేసు నమోదు
ముంబై: భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్కు ఈ కాల్ వచ్చినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఏకంగా ఎనిమిది సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ సీఈఓ, తరంగ్ జియాంచందానీ మాట్లాడుతూ.. 'మాకు 8 సార్లు బెదిరింపు కాల్లు వచ్చాయి, ఈ రోజు మేము కాల్ చేసిన వ్యక్తిని ఉగ్రవాదిగా పరిగణిస్తున్నాము, మేము ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసాము. మేము మా సెక్యూరిటీ గార్డులకు కూడా చెప్పాము' అని అన్నారు.
"ముకేష్ అంబానీ మరియు కుటుంబ సభ్యులను బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది" అని ఆమె తెలిపారు.
కాగా, గతంలోనూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఆయన నివాసం అంటిలియా వద్ద పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియో కనిపించడం కలకలం రేపింది. కొందరు దుండగులు జిలెటిన్ స్టిక్స్ ఉన్న కారును అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ కారును పోలీసులు గుర్తించి తనిఖీ చేయగా.. అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖ లభ్యమైంది.