ఆయిల్ ధరల ఎఫెక్ట్: ఆసియా దేశపు ధనికుల జాబితాలో టాప్ ప్లేస్ కోల్పోయిన అంబానీ
ముంబై: ప్రపంచదేశ ధనికుల్లో ఒకరిగా ఆసియా దేశపు ధనికుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారిగా తన స్థానం కోల్పోయారు. ప్రస్తుతం ఆసియాదేశపు అత్యంత ధనికుడిగా చైనాకు చెందిన జాక్మా తొలిస్థానానికి ఎగబాకారు. ప్రపంచ మార్కెట్ల పతనంతో ఆయిల్ ధరలు కూడా పతనమవడంతో ముఖేష్ అంబానీ తొలిస్థానం కోల్పోయారు.
కరోనావైరస్ దెబ్బ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఆసియాదేశపు అత్యంత ధనికుడిగా ఉన్న ఆయన రెండో స్థానానికి పడిపోయారు. కరోనావైరస్ దెబ్బకు మార్కెట్లు కుదేలు కావడం అదే సమయంలో ఆయన చమురు ధరలు పడిపోవడంతో ముఖేష్ అంబానీ అగ్రస్థానంను కోల్పోయారు. ఒక్కసారిగా అంబానీ నికర ఆస్తుల విలువ 5.8 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ఆసియాదేశపు అత్యంత ధనికుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. ఇక అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా అగ్రస్థానానికి ఎగబాకారు. 2018లో జాక్మా అగ్రస్థానంలో కొనసాగారు. ప్రస్తుతం 2.6 బిలియన్ డాలర్లు ఎక్కువతో అంబానీని దాటేశారు జాక్మా.
కరోనాదెబ్బకు గత 29 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు పడిపోవడం, సౌదీ అరేబియా మరియు రష్యా దేశాలు మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేయబడటంతో ఆయిల్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ప్రభావమే అంబానీ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆయిల్ రంగంపై పడింది. ఇక అంబానీ గ్రూపులోని ఆయిల్ మరియు పెట్రోకెమికల్స్లో వాటాలను సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీకి విక్రయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కరోనావైరస్ దెబ్బకు అలీబాబా గ్రూప్ కూడా నష్టాల బాట పట్టినప్పటికీ ఈ నష్టాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ యాప్స్ పూడ్చాయి. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్కు నష్టాలను పూడ్చే మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. 2009 తర్వాత తొలిసారిగా ఆయిల్ సంస్థలు సోమవారం రోజున 12శాతం మేరా కుదేలయ్యాయి. దీంతో మొత్తంగా 26శాతం మేరా నష్టాలు చవిచూసింది.