ఊహించని పరిణామం: మోడీ సమర్థుడు, మళ్లీ ప్రధాని.. సోనియా పక్కనుండగా ములాయం ట్విస్ట్, అఖిలేష్ ఏమంటారు?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి విపక్షాలు ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కొన్ని పార్టీలు మాత్రం దూరంగా ఉంటున్నాయి. బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో విపక్షాల ఐక్యతపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ములాయం సింగ్ ట్విస్ట్
యూపీలో ఎస్పీ, బీఎస్పీలు కలిశాయి. జాతీయస్థాయిలో విపక్షంలో ఉంటామని చెబుతున్న ఆ పార్టీ అధినేతలు, యూపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసేది లేదని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం నాటి చంద్రబాబు దీక్షకు పలువురు నేతలు దూరంగా ఉన్నారు. ఓ వైపు యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీలు కలవగా... ఎస్పీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకు అఖిలేష్ బీజేపీకి దూరం అంటే, తండ్రి ములాయం.. మోడీపై ప్రశంసలు కురిపించారు. ఎన్నికలకు ముందు ఇది ఊహించని ట్విస్ట్.

మోడీయే మళ్లీ ప్రధాని కావాలి, ఆయనే సమర్థుడు
2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సమాజ్వాది పార్టీ (ములాయం) మద్దతు పలికింది. లోక్సభ ఎన్నికల్లో తాము బీజేపీ వెంటే ఉంటామని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పకనే చెప్పారు. నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నామని, ఆయన ప్రధాని కావాలని కోరుకుంటున్నానని ములాయం చెప్పారు. అన్ని పనులను చక్కబెట్టడంలో మోడీ సమర్థుడు అన్నారు. మోడీ అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తారని చెప్పారు. 16వ లోకసభ చివరి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన మాట్లాడారనే విషయం ఇక్కడ గమనార్హం. సోనియా గాంధీ పక్కన ఉండగానే ములాయం బాంబు పేల్చారు. ఆ సమయంలో సోనియా పక్కనున్న ఎంపీలతో మాట్లాడారు. కాస్త ముభావంగా కనిపించారు. ములాయం మాట్లాడుతుండగా ఓసారి ఆయనవైపు ఎగాదిగా చూశారు. ఓ సమయంలో చిన్నగా నవ్వారు. కాగా, లోకసభలో ములాయంకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.

అఖిలేష్ ఏమంటారు
ములాయం సింగ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. ఇలాంటి సందర్భంగా ములాయం కీలక వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ ఎలా స్పందిస్తారనేది చర్చగా మారింది. ములాయం వ్యాఖ్యలపై ఓ మీడియా ఛానల్తో శరద్ పవార్ మాట్లాడుతూ.. ములాయం వ్యాఖ్యలకు ప్రాధాన్యత లేదని, మోడీ ఏమిటో ఇప్పటికే తెలిసిందని చెప్పారు. మరోవైపు, ములాయం వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ విభేదించారు.












Click it and Unblock the Notifications