యుపిఎపై అవిశ్వాం: సీమాంధ్ర ఎంపీలకు ఎస్పీ షాక్
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని సమాజ్వాదీ పార్టీ తేల్చేసింది. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసు చర్చకు రావడమే కష్టంగా మారింది. నోటీసు ఇవ్వాలా వద్దా అన్న సందిగ్ధంలో సీమాంధ్ర కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు చిక్కుకున్నారు.
రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో దుమారం చెలరేగుతుండడం, అవిశ్వాసంపై మద్దతు విషయంలో సమాజ్వాదీ వెనకడుగు వేయడంతో భవిష్యత్ కార్యాచరణపై సీమాంధ్ర ఎంపీలు తర్జన భర్జనలు పడుతున్నారు. ఇక లోక్పాల్ బిల్లుకు మద్దతు ఇస్తామని తెలుగుదేశం ప్రకటించిన నేపథ్యంలో, తదుపరి వ్యూహంపై సీమాంధ్ర తెలుగుదేశం పార్లమెంటు సభ్యుల్లో కూడా ఆస్పష్టత చోటు చేసుకుంది.
మంగళవారం ఉదయం చంద్రబాబుతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాతే తమ వ్యూహాన్ని నిర్ణయించుకోవాలని తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అనుకున్నారు. ఇక తమ సంఖ్యా బలాన్ని బట్టి మంగళవారం అవిశ్వాస తీర్మానానికి మళ్లీ నోటీసు ఇచ్చేదీ లేనిది నిర్ణయిస్తామని కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు అంటున్నారు.
అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చేది లేదని, ఎన్నికలు రెండు, మూడు నెలల్లో జరుగుతుండగా అవిశ్వాసానికి అర్థం లేదని సమాజ్వాదీ నేత రాంగోపాల్ యాదవ్ సోమవారం స్పష్టం చేశారు. దీంతో చర్చను అనుమతించేందుకు అవసరమైన 50 మంది మద్దతును సమీకరించడమే సాధ్యమయ్యే పరిస్థితి లేదు.