4500 మంది వైద్యుల సామూహిక సెలవు... అల్లాడుతున్న రోగులు
తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా 4,500 మంది ప్రభుత్వ వైద్యులు సామూహిక సెలవులు పెట్టారు.
ముంబై: తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా 4,500 మంది ప్రభుత్వ వైద్యులు సామూహిక సెలవులు పెట్టారు. బాంబే హైకోర్టు సమ్మెకు అనుమతి నిరాకరించడంతో వీరంతా గుట్టుచప్పుడు కాకుండా సెలవులు పెట్టేశారు.
వారం రోజులుగా వీరు విధులకు హాజరు కావడం లేదు. వైద్యులు సెలవుల్లో ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అల్లాడిపోతున్నారు. అవుట్ పేషెంట్ విభాగంలో రద్దీ విపరీతంగా పెరగడంతో సీనియర్ వైద్యులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లను ప్రభుత్వం పిలిపించింది.
మరోవైపు మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్(ఎంఏఆర్డీ), మెడికల్ కాలేజ్ డీన్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ముంబైలో మేయర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైద్యులకు భద్రత కల్పించాలని కోరారు.
సియోన్ ఆస్పత్రిలో ఓ రోగి చికిత్స పొందుతూ చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ అతడి బంధువులు వైద్యుడిపై దాడి చేశారు. అక్కడ 25 మంది సెక్యూరిటీ గార్డులను నియమించాల్సి ఉంది.
రోగుల బంధువుల దాడుల పెరిగిపోతున్నాయని, వారి నుంచి భద్రత పెంచాలని డిమాండ్ చేస్తూ వైద్యులు సామూహిక సెలవులు పెట్టారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.