ఇళ్లంతా సీసీటీవీలు.. భార్యను బలితీసుకున్న సైకో భర్త!
పెళ్లయిన కేవలం 48 రోజులకే ఓ 26 ఏళ్ల వివాహిత.. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై సమీపంలోని థానే పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలిని విశాఖ తిల్కర్గా గుర్తించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె భర్త నితిన్ తిల్కర్.. ఆమెకు కనీస వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా ఇళ్లంతా సీసీటీవీ కెమెరాలను అమర్చి నిరంతరం నిఘా పెట్టడమే కాకుండా తీవ్ర శారీరక మానసిక వేధింపులకు గురిచేయడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
విశాఖ తిల్కర్ కుటుంబసభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 30న విశాఖ, నితిన్ల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ.. వివాహం జరిగిన వెంటనే అత్తమామల ప్రవర్తన మారిపోయింది. కట్నకానుకలు తాము ఆశించిన స్థాయిలో లేవని.. తమకు సరైన గౌరవం దక్కలేదంటూ వారు విశాఖను వేధించడం ప్రారంభించారు. అంతే కాకుండా పుట్టింటి నుంచి అదనంగా నగలు, డబ్బు తీసుకురావాలంటూ నిరంతరం ఒత్తిడి తెచ్చేవారు.

ఈ వేధింపులు ఇంతటితో ఆగకుడా భర్త నితిన్ తీవ్రమైన సైకోలా ప్రవర్తించాడు. విశాఖ ఎవరితో మాట్లాడుతుందో గమనించేందుకు ఇంటి లోపల, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఆమె ఎవరితోనైనా మాట్లాడితే వెంటనే ఆమెపై దాడి చేసేవాడు. ఆత్మహత్యకు రెండు రోజుల ముందు కేవలం పక్కింటి మహిళతో మాట్లాడిందనే కారణంతో విశాఖను భర్త, అత్తమామలు పశువులా కొట్టారు. ఈ దారుణమైన నరకాన్ని భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన విశాఖ తిల్కర్ ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచింది.
తాను ఎదుర్కొంటున్న నరకయాతన గురించి విశాఖ ఆత్మహత్యకు ముందే తన తల్లికి ఫోన్ చేసి చెప్పి బోరుమంది. కూతురి పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగానే.. ఆమె ఆత్మహత్య చేసుకుందనే వార్త వారిని కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ ఘటనపై థానేలోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విశాఖను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు, వేధించినందుకు గానూ భర్త నితిన్ తిల్కర్, అత్త ఛాయా, మరిది నినాద్ లపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడైన డాక్టర్ నితిన్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications