ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ నిలిపివేత: స్టాక్ వస్తేనే 18ఏళ్లు పైబడినవారికి..
ముంబై: మే 1 నుంచి 18ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రం చెప్పినప్పటికీ.. పలు రాష్ట్రాలు మాత్రం మరింత సమయం పడుతుందని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా వ్యాక్సినేషన్ ఆలస్యం కానుంది.
అంతేగాక, ముంబై నగరంలో మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే, వ్యాక్సిన్ కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో అందరికీ ఇప్పుడే కరోనా వ్యాక్సిన్ వేయలేమని చెప్పింది.
శుక్రవారం నుంచి మూడు రోజులపాటు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మే 2 వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆ రోజు నుంచి వ్యాక్సిన్ వేస్తామని ముంబై కార్పొరేషన్ వెల్లడించింది. వ్యాక్సిన్ స్టాక్ రాగానే మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపింది.

కరోనా కేంద్రాల వద్ద బారులు తీరవద్దని, ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరింది. వ్యాక్సిన్ స్టాక్ రాగానే అందరికీ టీకాలు వేస్తామని స్పష్టం చేసింది. మే 1 నుంచి కరోనా వ్యాక్సిన్ అందరికీ అందిస్తామని చెప్పలేమని, సరిపడ వ్యాక్సిన్ వచ్చిన తర్వాతనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని ముంబై మున్సిపల్ అడిషనల్ కమిషనర్ అశ్వినీ భిడే ఇటీవల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, బుధవారం నాటికి 1.5 లక్షల వ్యాక్సినేషన్ కొరత ఉన్నట్లు సర్కారు లెక్కలు వెల్లడిస్తున్నాయి.
Recommended Video
మహారాష్ట్రతోపాటు పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు కూడా కరోనా వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నట్లు ప్రకటించాయి. 10 లక్షల వ్యాక్సిన్లు రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే తాము వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని పంజాబ్ ఆరోగ్యమంత్రి బల్బీర్ సింధు స్పస్టం చేశారు. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగానే నమోదవుతూనే వస్తున్నాయి. మహారాష్ట్రలో గురువారం 66,159 కరోనా కేసులు నమోదు కాగా, 771 మంది మరణించారు.












Click it and Unblock the Notifications